కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
చంచల్గూడ: రాష్ట్రంలో కుటుంబ పాలనను తరిమికొట్టే విధంగా ప్రజలు ముందడుగు వేస్తున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రం లీక్ వ్యవహారంలో నిరసన తెలిపిన బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాశ్తో పాటు మరికొందరు నాయకులను అరెస్టు చేసి చంచల్గూడ జైలు తరలించిన విషయం తెలిసిందే. జైల్లో ఉన్న భానుప్రకాశ్, ఇతర నాయకులను ఆదివారం కిషన్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలను రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పోటీ పరీక్ష రాస్తే ఫలితాలు వచ్చే సమయానికి ప్రశ్నపత్రం లీక్ కావడం దురదుష్టకరమన్నారు. ప్రభుత్వం పట్ల అన్ని జిల్లాల్లో యువత తీవ్ర ఆక్రోశంతో ఉన్నారని ఆయన చెప్పారు. ఎన్ని అక్రమాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదన్నారు. ప్రశ్నపత్రాల లీక్పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాల్సిన అవసరముందన్నారు. కుంభకోణంపై నిరసన తెలిపిన బీజేవైఎం నాయకులను అక్రమంగా అరెస్టు చేసి జైలు తరలించడం అన్యాయమన్నారు. కిషన్రెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, శ్యామ్సుందర్ తదితరులు ఉన్నారు.
మీడియాతో మాట్లాడుతున్న కిషన్రెడ్డి