ఇద్దరి అరెస్ట్... రూ.2.9 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం
శంషాబాద్: నకిలీకరెన్సీ తయారి చేసి వాటిని చలామణి చేస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు చేధించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నర్సారావు పేట జిల్లా గురజాలకు చెందిన ఎన్.వెంకటేశ్వర్లు (45) నగరంలో ఎల్బీనర్లో నివాసముంటూ సివిల్ కాంట్రాక్టరుగా చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతడికి సంపాదన సరిపోకపోవడంతో సులభంగా సంపాదించేందుకు శంషాబాద్ వెళాంగనీ కాలనీలో నివాసముంటున్న గురజాలకు చెందిన శ్రీనివాస్ ( 44)తో కలిసి పథకం వేశాడు. నకిలీ కరెన్సీ తయారీకి కొందరు ఏజెంట్లను సంపాదించి, అందుకు సంబంధించిన ప్రింటర్లు ఇతర వస్తువులు సమకూర్చుకున్నారు. శ్రీనివాస్ ఇంట్లోనే ఓ గదిలో వాటిని ఏర్పాటు చేసి నకిలీ ఐదు వందలు, వంద నోట్లను తయారు చేయడం ప్రారంభించారు. రద్దీ ప్రాంతాలైన మార్కెట్లు తదితర ప్రాంతాల్లో వాటిని చలామణి చేయడం ప్రారంభించారు. ఏజెంట్ల ద్వారా ఏపీ, కర్నాటక తదితర రాష్ట్రాలకు కూడా వాటిని సరఫరా చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం ఉదయం దాడులు చేశారు. వెంకటేశ్వర్లు, శ్రీనివాస్లను అరెస్ట్ చేయడంతో పాటు 2.9 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏడు లక్షల విలువ చేసే ప్రింటర్లు, కారు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.