బంజారాహిల్స్లో అర్ధరాత్రి ఘటన
ప్రమాదంలో ఉందని గ్రహించిన ఇంటర్ విద్యార్థి
పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను బలవంతంగా ఆటోలో తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో హెల్ప్..హెల్ప్ అంటూ సహాయం కోసం అరవడాన్ని గమనించిన ఓ యువకుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడిపాటి కృష్ణ (18) అనే యువకుడు బాచుపల్లిలోని సీఎంఎస్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
తన స్నేహితులైన సుమన్, వశిష్ట్లతో కలిసి ఆదివారం రాత్రి ఓల్డ్ సిటీలో మరో స్నేహితుడు వివేక్ సోదరి వివాహానికి హాజరయ్యారు. తిరిగి ఇంటికి వెళ్ళే క్రమంలో బంజారాహిల్స్ ఎన్ఎఫ్సీఎల్–కేబీఆర్ పార్కు రోడ్డులో వెళ్తుండగా..వీరు ప్రయాణిస్తున్న బైక్ పక్క నుంచే ఆటో వెళ్లింది. అయితే ఓ మహిళ ఒక్కసారిగా ఆటోలో నుంచి హెల్ప్..హెల్ప్..అంటూ అరవడం గమనించారు.
ఆటో పక్కగా బైక్పై వెళ్తున్న మరో వ్యక్తి ఆమె నోరు మూయాల్సిందిగా ఆటోలో ఆమె పక్కనే కూర్చొన్న వ్యక్తికి చెబుతుండడం గమనించారు. సదరు మహిళ ఆపదలో ఉందని గ్రహించిన వారు వెంటనే 100కు డయల్ చేసి ఆటోను అనుసరించారు. కొద్దిసేపు ఆటోను ఫాలో అయినప్పటికీ తప్పించుకోవడంతో గుడిపాటి కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.