Sakshi News home page

అధ్యక్ష బరిలో వివేక్‌ రామస్వామి.. ‘అమెరికా ఈ పరిస్థితికి చరమగీతం పాడదాం’

Published Thu, Feb 23 2023 5:26 AM

Indian-American entrepreneur Vivek Ramaswamy announces 2024 presidential bid - Sakshi

వాషింగ్టన్‌: భారతీయ మూలాలున్న అమె రికన్‌ యువ పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామి ఆ దేశ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచిన భారతీయ మూలాలున్న రెండో భారతీయుడు వివేక్‌ కావడం విశేషం. 37 ఏళ్ల వివేక్‌ తల్లిదండ్రులు గతంలో కేరళ నుంచి అమెరికాకు వలసవచ్చారు. డొనాల్డ్‌ ట్రంప్‌కు పోటీగా దక్షిణ కరోలినా మాజీ గవర్నర్, ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఇటీవలే పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నట్లు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టడం తెల్సిందే.

‘అమెరికాను మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషిచేస్తా. అంతకుముందు మనం అమెరికా గొప్పదనాన్ని మరోసారి పునశ్చరణ చేసుకుందాం. చైనా ఆధిపత్యం వంటి సవాళ్లను అమెరికా ఎదుర్కొంటోంది. అమెరికా సార్వభౌమత్వాన్ని చైనా ఉల్లంఘిస్తోంది. ఒక వేళ రష్యా నిఘా బెలూన్‌ వచ్చి ఉంటే కూల్చి వెంటనే ఆంక్షలు విధించేవాళ్లం. చైనా విషయంలో ఆంక్షలు ఎందుకు విధించలేకపోయాం?. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో ఉత్పత్తుల కోసం చైనాపై మనం అంతలా ఆధారపడ్డాం. ఆర్థికంగా ఇలా మరో దేశంపై ఆధారపడే పరిస్థితికి చరమగీతం పాడదాం’ అని ఫాక్స్‌న్యూస్‌ ప్రైమ్‌టైమ్‌ షో సందర్భంగా వివేక్‌ వ్యాఖ్యానించారు.

వివేక్‌ 2014లో రోవంట్‌ సైన్సెస్‌ను స్థాపించారు. హెల్త్‌కేర్, టెక్నాలజీ సంస్థలను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 2022లో స్ట్రైవ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థనూ నెలకొల్పారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగాలంటే ముందుగా వివేక్‌ రామస్వామి, నిక్కీ హేలీ, డొనాల్డ్‌ ట్రంప్‌లలో ఎవరో ఒకరు రిపబ్లిక్‌ పార్టీలో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రైమరీ ఎన్నికల్లో నెగ్గాలి. వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రక్రియ మొదలుకానుంది. అధ్యక్ష ఎన్నికలు వచ్చే ఏడాది నవంబర్‌ ఐదో తేదీన జరుగుతాయి. 2016లో బాబీ జిందాల్, 2020లో కమలాహ్యారిస్, ఈసారి నిక్కీ హేలీ తర్వాత అధ్యక్ష ఎన్నికలకు దిగిన నాలుగో ఇండో–అమెరికన్‌ వివేక్‌ రామస్వామికావడం విశేషం.

Advertisement
Advertisement