ఫ్రీగా వచ్చిందని డిటర్జంట్‌ తినడంతో.. | Sakshi
Sakshi News home page

Taiwan: ఫ్రీగా వచ్చిందని డిటర్జంట్‌ తినడంతో..

Published Thu, Jan 11 2024 10:14 AM

Taiwan 3 Hospitalized after Consuming Laundry Detergent - Sakshi

తైవాన్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. చిన్నపాటి పొరపాటు కూడా ప్రాణాలు పోయే పరిస్థితిని కల్పిస్తుందని ఈ ఉదంతం తెలియజేస్తోంది. తైవాన్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేసిన లాండ్రీ డిటర్జంట్‌ను ముగ్గురు వ్యక్తులు పొరపాటున తిన్నారు. ఆ తర్వాత వారు అనారోగ్యంపాలై ఆసుపత్రిలో చేరారు. సకాలంలో చికిత్స అందడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఉచితంగా లాండ్రీ డిటర్జెంట్ పంపిణీ చేశారు. దీనిని మిఠాయిగా బావించి, తిన్నవారు అనారోగ్యం పాలయ్యారు. సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం బాధితుల్లో ఒకరు తాను డిటర్జంట్‌ను పొరపాటున మిఠాయిగా భావించానని అన్నారు. 

ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిన డిటర్జెంట్ ప్యాక్‌పై బట్టలు ఉతకడానికి అని స్పష్టంగా రాసి ఉంది. అలాగే ఒక్కో ప్యాకెట్‌పై దీనితో ఎనిమిది కిలోల వరకు దుస్తులను ఉతకవచ్చని రాసి ఉంది. ప్రచార సమయంలో జాతీయవాద ప్రచార కార్యాలయం సుమారు 4,60,000 ప్యాకెట్లను పంపిణీ చేసిందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ సంఘటన తర్వాత సెంట్రల్ తైవాన్‌లోని ఎన్నికల ప్రచార కార్యాలయ ప్రతినిధి క్షమాపణలు చెప్పారు. ఇకపై ఇలాంటి మెటీరియల్‌ను ప్రజలకు పంపిణీ చేయబోమని కార్యాలయ చీఫ్  ఒక వీడియో ద్వారా తెలిపారు. ఇది మిఠాయి కాదని, లాండ్రీ డిటర్జెంట్ అని కూడా  ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. కాగా ఆసుపత్రిలో చేరిన వారిలో ఇద్దరు వృద్ధులున్నారని వార్తా సంస్థ తెలిపింది. చికిత్స అనంతరం వారిద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement
Advertisement