రష్యా దళాలు బాంబు దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. దేశం కోసం ముందుకొచ్చిన వాళ్లకు ఆయుధాలు ఇస్తామని వెల్లడించారు. ఉక్రెయిన్కు మద్ధతుగా పోరాడేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోవైపు రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార చర్యలు చేపట్టింది. రష్యాతో అన్ని దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించింది.
ఏడు రష్యా విమానాలు కూల్చివేత: ఉక్రెయిన్
మరోవైపు ఉక్రెయిన్లో రష్యా బలగాలు ప్రవేశించాయి. బెలారస సరిహద్దు నుంచి రష్యా ఉక్రెయిన్లోకి ప్రవేశించింది. పలు ప్రాంతాల్లో దాడులు జరపడంతో ఉక్రెయిన్ పౌరులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ల్వీవ్ ప్రాంతాల్లో వైమానికి దాడులు జరిపింది. కీవ్, ఖార్కివ్, మర్యుపోల్ నగరాలపై రష్యా బాంబు దాడులు చేసింది. రెండు గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసిటన్లు ప్రకటించింది. మరోవైపు రష్యా దాడులను ఉక్రెయిన్ ప్రతిఘటిస్తోంది. ఏడు రష్యా విమానాలను, హెలికాప్టర్ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
చదవండి: Russia Ukraine War: ప్రాణ భయంతో జనం పరుగులు..
లిథువేనియాలో అత్యవసర పరిస్థితి
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వాటికి సరిహద్దు దేశాల్లో కూడా ఆందోళన నెలకొంది. రష్యా దాడి చేసే ఒక రోజు ముందే ఉక్రెయిన్ జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించగా.. తాజాగా ఉక్రెయిన్తో సరిహద్దు పంచుకుంటున్న మరోదేశం లిథువేనియాలో కూడా అత్యవసర పరిస్థితిని విధించారు. లిథువేనియా అత్యవసర పరిస్థితిని ప్రకటించిస్తూ ఆ దేశ అధ్యక్షుడు గిటానాస్ నౌసేదా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో మోల్డోవా తన గగనతలాన్ని మూసివేయాలని నిర్ణయించుకుంది.
చదవండి: రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం: యుద్ధంపై భారత్ రియాక్షన్ ఇది
40 మంది సైనికులు మృతి
రష్యా దాడిలో ఉక్రెయిన్కు చెందిన 40 మంది సైనికులు, 10 మంది పౌరులు మృతి చెందినట్లు ఆ దేశ ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. రష్యా చేపట్టిన మిలటరీ ఆపరేషన్లో వందలాది మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. రష్యా చేస్తున్న యుద్ధంలో సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొంది.