మారణ హోమానికి పాల్పడొద్దు.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం | Sakshi
Sakshi News home page

మారణ హోమానికి పాల్పడొద్దు.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం

Published Fri, Jan 26 2024 9:53 PM

World Court orders Israel To Prevent Incitement Genocide Gaza - Sakshi

ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై దాడులు చేస్తూ విరుచుకుపడుతూనే ఉంది. హమాస్‌ మిలిటెంట్లను అంతం చేయటమో తమ లక్ష్యంగా బాంబు దాడులకు తెగపడుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో ‘మారణ హోమం’ జరుగుతోందని ఆరోపిస్తూ సౌతాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ)లో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దానిపై నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌ విచారణ జరిపింది.

గాజాలో మారణ హోమానికి దారి తీసే ఎటువంటి చర్యలు చేపట్టరాదని ఐసీజే ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని మాత్రం ఆపేయమని కానీ, కాల్పుల విరమణకు సంబంధించి కానీ ఎలాంటి ప్రకటన చెయకపోవటం గమనార్హం.

‘గాజా ప్రాంతంలో జరుగుతున్న మానవీయ విషాదం తీవ్రత సంబంధించి మాకు తెలుసు. యుద్ధంలో పోతున్న ప్రాణాలు, ప్రజలు పడుతున్న కష్టాల పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తోంది’ అని అంతర్జాతీయ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దక్షిణాఫ్రికా కోరినట్లు కోర్టు కాల్పుల విరమణ సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కోర్టు ఉత్తర్వులను అనుసరించి తీసుకున్న చర్యలపై నెల రోజుల్లోగా నివేదిక  సమర్పించాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించింది.

దక్షిణాఫ్రికా ఆరోపణలను ఇజ్రాయెల్ మరోసారి తీవ్రంగా ఖండించింది. దక్షిణాఫ్రికా దేశం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని.. మొత్తంగా వక్రీకరించబడిన మాటలని మండిపడింది.

గాజాలోని హమాస్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటి వరకు 26000మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపు దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్‌ ప్రజలు మృతి చెందారు.

Advertisement
Advertisement