కాకినాడ సిటీ: కాకినాడ రూరల్ నియోజకవర్గంలో దోష రహిత ఓటర్ల జాబితా రూపకల్పనపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ అధికారి ఈట్ల కిషోర్ మంగళవారం కాకినాడ ఆర్డీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఓటర్ల నమోదుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ మార్పులు, చేర్పులు, అదే విధంగా 2024 జనవరి నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లుగా చేర్చామన్నారు. ఈనెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఫారం 6, 642, ఫారం–7 189, ఫారం–8 497 దరఖాస్తులు వచ్చాయని రాజకీయపార్టీల ప్రతినిధులకు వివరించారు. సమావేశంలో రాజకీయపార్టీల ప్రతినిధులు రావూరి వెంకటేశ్వరరావు, ఎస్ అప్పారావు, కేవీ రామయ్య, కె కృష్ణమోహన్, రూరల్ తహసీల్దార్ మురార్జీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
హిందూ ఫెడరేషన్
రాష్ట్ర అధ్యక్షులుగా ప్రసాద్
గండేపల్లి: విశ్వ హిందూ మహాసంఘ్ (వరల్డ్ హిందూ ఫెడరేషన్) రాష్ట్ర అధ్యక్షునిగా తాళ్లూరులోని జీయర్ స్వామి మఠాధిపతి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాదాచార్యుల్ని నియమించినట్టు మఠాధిపతులు తెలిపారు. ఢిల్లీలో గల అతి పురాతన కాళికామాత పీఠంలో మంగళవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు వారు పేర్కొన్నారు. విశ్వ హిందూ మహాసంఘ్, గోరక్షా పీఠాదీశ్వర్లు, సంరక్షకులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహారాజ్, జాతీయ అధ్యక్షులు అవధూత యోగి సురేంద్రనాథ్ మహారాజ్, జాతీయ కార్యనిర్వాహక మంత్రి యోగి రాజకుమార్ నాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. సనాతన భారతీయ ధర్మ పరిషత్ సంస్థాపక అధ్యక్షుడు, ముండూరు యాజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాదీశ్వరులు కృష్ణచరణానంద స్వామిని జాతీయ కార్యదర్శిగా, ధక్షిణ భారత అధ్యక్షుడుగా నియమించినట్టు వివరించారు. ఈ సందర్భంగా ప్రసాద్కు మఠాధిపతులు, సనాతన ధర్మం ప్రచారకర్తలు, తదితరులు అభినందనలు తెలిపారు.