కరీంనగర్ కల్చరల్: కరీంనగర్ పద్మనగర్లో బుధవారం ఉదయం టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించే శ్రీవారి ఆలయానికి భూమిపూజ, సాయంత్రం నిర్వహించే కల్యాణానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని మంత్రి గంగు కమలాకర్ కోరారు. మంగళవారం సాయంత్రం టీటీడీ ఆలయ ప్రధానార్చకుడు వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో విశ్వక్సేన, పుణ్యహవచనం, శిలాధివాసం, మండపారాధన పూజల్లో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ సునీల్రావు పాల్గొన్నారు. గజరాజుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మంకమ్మతోట వేంకటేశ్వర ఆలయం నుంచి సాయంత్రం నాలుగు గంటలకు సారెతో టీటీడీ క్షేత నిర్మాణ ప్రతిపాదిత స్థలం వరకు శోభాయాత్ర, అనంతరం శ్రీవారి కల్యాణం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీపీ సుబ్బరాయుడు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ పాల్గొన్నారు.
హాజరుకానున్న టీటీడీ చైర్మన్
శ్రీవారి కల్యాణం కోసం తిరుపతి నుంచి తెప్పించిన 20 వేల లడ్డూలు కరీంనగర్కు చేరుకున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీవారి కల్యాణానికి వచ్చేభక్తులకు తిరుపతి లడ్డూతో పాటు పసుపు, కుంకుమ, కంకణం ప్రసాదంగా ఇవ్వనున్నారు. కల్యాణం అనంతరం అన్నదానం చేయనున్నారు. భూమిపూజకు ముఖ్య అతిథులుగా మంత్రి గంగుల కమలాకర్తో పాటు టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, హైదరాబాద్ లోకల్ అడ్వయిజరీ చైర్మన్ జీవీ భాస్కర్రావు, రాజ్యసభ సభ్యుడు డి.దామోదర్రావు, టీటీడీ ఆలయ ఈవో ధర్మారెడ్డి హాజరుకానున్నారు.
గజరాజుల ఆశీర్వాదం తీసుకున్న ప్రజాప్రతినిధులు
భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరిన మంత్రి గంగుల కమలాకర్