బనశంకరి: తల్లీ కొడుకుల బంధాన్ని మృత్యువు కూడా వేరుచేయలేకపోయింది. స్నానపు గదిలో బకెట్లో నీరు కాయడానికి వేసిన వాటర్ హీటర్ షాక్ కొట్టి తల్లీ కుమారుడు మృతి చెందారు. ఈ ఘటన హొసకోటే పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాయచూరు కు చెందిన జ్యోతి (35), కుమారుడు జయానంద్ (4) మృతులు. జ్యోతి, భర్తతో కలిసి జీవనోపాధి కోసం బెంగళూరుకు చేరుకుని గారపని చేస్తూ హొసకోటె తాలూకా కనకనగరలో నివాసం ఉంటున్నారు. భర్త గారపనికి వెళ్లి రెండు మూడు రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు.
బాలుడు కేకలు వేయడంతో
ఆదివారం మధ్యాహ్నం స్నానం చేయడం కోసం నీరు కాయడానికి బకెట్లో వాటర్హీటర్ పెట్టారు. ఈ సమయంలో బాలుడు జయానంద్ బాత్రూమ్కు వెళ్లగా హీటర్ పెట్టిన బకెట్ను తాకడంతో కరెంట్ షాక్కు గురై గట్టిగా కేకలు వేశాడు. కుమారున్ని కాపాడటానికి వెళ్లిన జ్యోతికి కూడా కరెంట్ షాక్ తగిలి ఇద్దరూ ప్రాణాలు విడిచారు. సోమవారం ఉదయం వరకు ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రాలేదు. అంతేగాక జ్యోతి భర్త దూర ప్రదేశం నుంచి భార్యకు ఫోన్ చేస్తున్నా స్పందన లేదు. దీంతో పక్కింటివారికి కాల్ చేయగా, ఇరుగుపొరుగు వెళ్లి గమనించగా తలుపు గడియ వేసి ఉండగా బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లీకొడుకుల మృతదేహాలు కనిపించాయి. పోలీసులు చేరుకుని మృతదేహాలకు శవపరీక్షల కోసం హోసకోటే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వాటర్హీటర్ షాక్ కొట్టి బాలుడు మృతి
కాపాడే ప్రయత్నంలో తల్లీ మృత్యువాత
హొసకోటెలో విషాద సంఘటన