బనశంకరి: సిలికాన్ సిటీలో బ్యాచిలర్లు, విద్యార్థులు, టెక్కీలు తదితరులు బస చేయాలంటే పీజీ హాస్టళ్లే గుర్తుకొస్తాయి. డబ్బు చెల్లిస్తే ఆహారం, బస వసతులు లభిస్తాయి. నగరంలో ఇది ఒక ప్రముఖ సేవా వ్యాపారంగా మారింది. అయితే.. పేయింగ్ గెస్ట్ హాస్టళ్లపై చుట్టుపక్కల ప్రజలు బీబీఎంపీకి ఫిర్యాదులు చేస్తున్నారు, ఈ నేపథ్యంలో పీజీలకు కొత్త మార్గదర్శకాలను ఏర్పాటు చేసి, ఒక వెబ్సైట్ను రూపొందిస్తామని నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరంలో 5 వేల పీజీ హాస్టల్స్ ఉన్నాయని తెలిపారు. పీజీలో చేరే ప్రతి ఒక్కరి వివరాలను ఈ వెబ్పోర్టల్లో పీజీ యజమానులు అప్లోడ్ చేయవచ్చునన్నారు. మారతహళ్లిలో 167 పీజీల్లో దీనిని ప్రయోగాత్మకంగా నిర్వహించామని, ఈ పథకం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉందని తెలిపారు. ఎవరు పీజీల్లోకి వస్తున్నారు, ఎవరు ఉంటున్నారు అనే సమాచారం తమకు లభిస్తుందన్నారు.
ఫిర్యాదులు వస్తున్నాయి: పాలికె కమిషనర్
పాలికె కమిషనర తుషార్ గిరినాథ్ మాట్లాడుతూ పాలికె లైసెన్సు నిబంధనలను ఉల్లంఘించి పలు పీజీలు నిర్వహిస్తున్నారు. పన్నుల సేకరణ దృష్టితో పీజీలను అధికారులు తనిఖీ చేయాలన్నారు. డబ్బుపై ఆశతో నిబంధనలు ఉల్లంఘించి ఒకే గదిలో ఎక్కువ మందిని ఉంచుతున్నారని, మౌలిక వసతులు కూడా సక్రమంగా అందించడంలేదన్నారు. సౌకర్యాలు కల్పించలేదని, ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీంతోపాటు పీజీలకు ఇరుగుపొరుగు ఉన్న ప్రజలు అనేక ఫిర్యాదులు చేశారని, ఈ నేపథ్యంలో పీజీలకు బీబీఎంపీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనుందని చెప్పారు.
నగర పోలీస్ కమిషనర్ వెల్లడి
పీజీల్లోని ప్రతి ఒక్కరి వివరాల
నమోదుకు వెబ్సైట్
సౌకర్యాలను మెరుగుపరచాలి
కొత్త మార్గదర్శకాలకు కసరత్తు