ఖమ్మంఅర్బన్: ఖమ్మం పాండురంగాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 70మంది పరీక్ష ఫీజును రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు కురువాటి మోయాస్ చెల్లించారు. ఒక్కో విద్యార్థికి రూ.125 చొప్పున 70మంది విద్యార్థుల ఫీజు రూ.8,750 ఆయన బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మోయాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉండడమే కాక నాణ్యమైన విద్య అందుతున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంతో పోలిస్తే పాఠశాలల్లో అన్ని వసతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.
22న జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం మధురానగర్లోని విన్ఫీల్డ్ స్కూల్లో ఈనెల 22న జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఈ.సోమశేఖరశర్మ తెలిపారు. జిల్లాలోని అన్ని యజమాన్య పాఠశాలలకు చెందిన 6నుంచి పదో తరగతి విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆరో గ్యం, సంక్షేమం కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవటం ప్రధాన అంశాలుగా ప్రాజెక్టులు ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు. ఒక్కో ప్రాజెక్ట్ వెంట ఇద్దరు విద్యార్థులు పాల్గొనవచ్చని, ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యేలా హెచ్ఎంలు చొరవ తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం జిల్లా అకడమిక్ కోఆర్డినేటర్(94404 50141)ను సంప్రదించాలని డీఈఓ తెలిపారు.
ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి
కామేపల్లి: గ్రామపంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లపై ఉద్యోగులు దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్ సూచించారు. కామేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించారు. ఆతర్వాత సిబ్బందితో సమావేశమైన డీపీఓ మాట్లాడుతూ పారిశుద్ధ్య పనుల్లో శ్రద్ధ కనబరుస్తూనే వంద శాతం పన్నులు వసూలు చేయాలని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఎంపీడీఓ విజయభాస్కరరెడ్డి తదితరులుపాల్గొన్నారు.