● జిల్లాకు 894 యూనిట్ల కేటాయింపు ● ర్యాండమైజేషన్ తర్వాత నియోజకవర్గాలకు..
ఖమ్మం సహకారనగర్: శాసనసభ ఎన్నికల నేపథ్యాన జిల్లాకు అదనపు బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ సందర్భంగా 894 బ్యాలెట్ యూనిట్లు జిల్లాకు శుక్రవారం చేరుకోగా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్ పార్టీల ప్రతినిధుల సమక్షాన జెడ్పీ ఆవరణలోని గోదాంలో భద్రపరిచారు. ఇప్పటికే బ్యాలెట్ యూ నిట్లు ఉన్నా పోటీలో మిగిలిన అభ్యర్థుల సంఖ్య ఆధారంగా మరిన్ని కేటాయించారని కలెక్టర్ తెలి పారు. వీటి ర్యాండమైజేషన్ చేపట్టాక నియోజవర్గాలకు పంపిస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్, తహసీల్దార్ సీహెచ్.స్వామి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాంబాబు, ఉద్యోగులు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
కంట్రోల్ రూమ్ తనిఖీ
ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన ఎన్నికల కంట్రోల్ రూమ్ను కలెక్టర్ గౌతమ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీ విజిల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నంబర్కు వస్తున్న ఫిర్యాదులు, పరిష్కారంపై ఆరా తీశారు. ఇప్పటివరకు సీ విజిల్ యాప్ ద్వారా 367 ఫిర్యాదులు రాగా పరిష్కరించామని, 1950 టోల్ ఫ్రీ నంబర్కు 616 మంది ఫోన్ చేశారని అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో సీపీఓ ఏ.శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో వసతులు
ఖమ్మంరూరల్/కూసుమంచి: పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలంలోని జలగంగనర్, తల్లంపాడు ఉన్నత పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ కేంద్రంలో టాయిలెట్లు, నీటి వసతితో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించడమే కాక ర్యాంప్లు నిర్మించాలని తెలిపారు. అలాగే, జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్గూడెంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్తో పాటు మరో చెక్పోస్ట్ను కలెక్టర్ గౌతమ్ తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటూ పార్టీల నాయకులు, అభ్యర్థుల వాహనాలే కాక పోలీస్, ప్రభుత్వ వాహనాలు, అంబులెన్స్లను తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. అలాగే, నగదు, మద్యం రవాణా జరగకుండా కట్టడి చేయాలని సూచించారు. తొలుత కూసుమంచిలో పలువురు ఓటర్లతో మాట్లాడి కలెక్టర్ ఓటరు స్లిప్పుల పంపిణీపై ఆరా తీశారు. ఈకార్యక్రమాల్లో పాలేరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాజేశ్వరీ,ఎంపీడీఓ రమావేవి, సీఐ జితేందర్రెడ్డి, ఈఈ నాగశేషు తదితరులు పాల్గొన్నారు.