మహబూబాబాద్ రూరల్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో 19వ వార్డులోని మార్వాడీ సత్రం ప్రాంతంలో బుధవారం ఓటర్లకు బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతుండగా రూ.43వేలు పట్టుకున్నామని టౌన్ సీఐ వై.సతీష్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్ తరఫున బీఆర్ఎస్ నాయకులు మార్వాడీ సత్రం వద్దకు ఓటర్లను పిలిపించి వారి వద్ద ఉన్న పోల్ చీటీలను తీసుకుని డబ్బులు ఇస్తున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం లీడర్ ఆర్.సుగుణాకర్కు సమాచారం అందిందని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకుని నగదును స్వాధీనం చేసుకుని డబ్బులు పంచుతున్న నల్లపు వీరన్నను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పోలీసు స్టేషన్కు తరలించాక కేసు నమోదు చేసి సదరు డబ్బును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సంబంధిత ఉన్నత అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
రూ.33 వేల నగదు పట్టివేత
మహబూబాబాద్ రూరల్ : మండలంలోని లక్ష్మతండా గ్రామ పంచాయతీ పరిధిలోని బూరుకుంట తండాలో బీఆర్ఎస్ తరఫున ఓటర్లకు పంచుతున్న రూ. 33,500 నగదును స్వాధీనం చేసుకున్నామని ఫ్లయింగ్ స్క్వాడ్ టీం లీడర్ సామ్రాజ్ బుధవారం రాత్రి తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు భూక్య రామారావు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా తమకు సమాచారం అందడంతో ఘటనా స్థలికి చేరుకొని అదుపులోకి తీసుకుని, డబ్బులు స్వాఽ దీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు కోసం పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.