AAdi, Simhadri, Ninnu Choodalani Movie Re Release On NTR Birthday, Fans Unhappy - Sakshi
Sakshi News home page

Jr NTR: ఒకేసారి మూడు సినిమాలు.. గందరగోళంలో అభిమానులు!

Published Wed, Apr 12 2023 12:22 PM

AAdi, Simhadri, Ninnu Choodalani Movie Re Release On NTR Birthday, Fans Unhappy - Sakshi

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. తమ అభిమాన హీరోల బర్త్‌డే సందర్భంగానో.. లేదా 10, 20 ఇయర్స్‌ పూర్తి చేసుకున్నారనో..ఇలా మొత్తంగా ఏదో ఒక కారణంతో హిట్‌ సినిమాలను మళ్లీ థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారు. ఫ్యాన్స్‌ నుంచి కూడా రీరిలీజ్‌ సినిమాలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అందుకే ఈ మధ్య స్టార్‌ హీరోల పుట్టిన రోజు నాడు ఏదో ఒక సినిమాను రీరిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, మహేశ్‌బాబు, పవన్‌ కల్యాన్‌, చిరంజీవి లాంటి హీరోల సినిమాలు రీరిలీజై మంచి వసూళ్లను రాబట్టాయి.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమాలు రీరిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మే 20న ఎన్టీఆర్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ నటించిన సూపర్‌ హిట్‌ సినిమాలను థియేటర్స్‌లో ప్రదర్శించబోతున్నారు. మే 20న 'సింహాద్రి' సినిమాని భారీస్థాయిలో రీరిలీజ్ చేయాలని అభిమానులు నిర్ణయించారు. దీంతో పాటు ‘ఆది’, ‘నిన్ను చూడాలని’ చిత్రాలను కూడా విడుదల చేయబోతున్నారు. ఆది చిత్రాన్ని అయితే మే 20 నుంచి  28 వరకు ప్రదర్శించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 'నిన్ను చూడాలని' చిత్రాన్ని మే 19న ప్రదర్శిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. 

గందరగోళంలో ఫ్యాన్స్‌
సాధారణంగా స్టార్‌ హీరోల బర్త్‌డే రోజు ఏదో ఒక్క సినిమా మాత్రమే..అది కూడా ఒక్క రోజే రీరిలీజ్‌ చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌ బర్త్‌డే (ఏప్రిల్‌ 8) సందర్భంగా ‘దేశముదురు’ చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. ఒక్క సినిమా కావడంతో ఫ్యాన్స్‌ అంతా ఆ చిత్రాన్ని వీక్షించారు. కానీ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి మాత్రం గందరగోళానికి గురవుతున్నారు. ఒకేసారి పలు సినిమాలను రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తుండటంతో ఏ సినిమా చూడాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు.  అయితే మెజారీటీ ఫ్యాన్స్‌ మాత్రం ‘సింహాద్రి’కే మొగ్గు చూపుతున్నారు. మరికొంతమంది అయితే ‘ఆది’, ‘సింహాద్రి’ రెండూ చూస్తామని కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement