Sakshi News home page

కథ విన్నప్పుడే కన్నీళ్లొచ్చాయి

Published Sun, Oct 8 2023 12:41 AM

Gayatri Bharadwaj Talks About Tiger Nageswara Rao Movie Press Meet - Sakshi

రవితేజ టైటిల్‌ రోల్‌ చేసిన తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో మయాంక్‌ సింఘానియా సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో గాయత్రీ భరద్వాజ్‌ మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం ఢిల్లీ. పుణేలో చదువుకున్నాను. మా నాన్నగారు పైలెట్‌. అమ్మ సైకాలజిస్ట్‌.

నాకు చిన్నప్పట్నుంచే ఫ్యాషన్‌ వరల్డ్‌లో ఫేమస్‌ కావాలని ఉండేది. నా ఏడో తరగతిలోనే ఫ్యాషన్‌ ర్యాంప్‌ వాక్‌ చేసి, విజేతగా నిలిచాను. ఆ తర్వాత భరత నాట్యం, క్లాసికల్‌ సింగింగ్‌ నేర్చుకున్నాను. హిందీలో అవకాశాలు రావడంతో ఓ సినిమా, మూడు వెబ్‌ సిరీస్‌లు చేశాను. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ నా తొలి తెలుగు సినిమా. నన్ను ఎంపిక చేయడానికి ముందు దాదాపు 60 మందిని ఆడిషన్‌ చేశారట.

ఈ చిత్రంలో విలేజ్‌లో టామ్‌బాయ్‌లా కనిపించే మణి పాత్ర చేశాను. దర్శకులు వంశీగారు ఈ పాత్ర గురించి దాదాపు మూడు గంటలు వివరించారు. పాత్రలో మంచి ఎమోషన్‌ ఉంది. కథ వింటున్నప్పుడే కన్నీళ్లొచ్చాయి. ఈ సినిమా విషయంలో నాకు భాషాపరంగా ఏ ఇబ్బంది లేదు. నాకు తెలుగు టీచర్‌ ఉన్నారు. ఇక రవితేజగారు సెట్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ప్రస్తుతం ఓ తెలుగు సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నార్త్‌ ఇండస్ట్రీలో కాస్త హరీబరీగా ఉంటుంది. కానీ తెలుగు పరిశ్రమలో చాలా ఓర్పుతో వర్క్‌ చేస్తున్నారు. లభిస్తున్న గౌరవం కూడా ఎక్కువే. తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాను ఎంతో ప్రేమిస్తారు’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

What’s your opinion

Advertisement