‘మాట’తో చేస్తున్న సేవకు ఆనందంగా ఉంది: శ్రీనివాస్‌ గనగోని | Sakshi
Sakshi News home page

‘మాట’తో చేస్తున్న సేవకు ఆనందంగా ఉంది: శ్రీనివాస్‌ గనగోని

Published Wed, Feb 28 2024 4:56 PM

Srinivas ganagoni And Suma Kanakala Comments On Mana American Telugu Association Services - Sakshi

మాట (మన అమెరికా తెలుగు అసోసియేషన్‌ ) ప్రారంభించిన  పదినెలల్లోనే  22 బ్రాంచిలు ఏర్పాటు చేసి దాదాపు 5000 మందితో అనేక సేవ కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు అసోసియేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు  శ్రీనివాస్‌ గనగోని. మాట అధ్వర్యంలో ఫిబ్రవరి 17 నుంచి వివిధ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 10 వరకు ఈ సేవ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని  కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరగుతున్న కంటి కాటరాక్ట్‌ ఆపరేషన్ల క్యాంప్‌ నేటితో(ఫిబ్రవరి 28) ముగియనుంది.

ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాట అధ్యక్షుడు  శ్రీనివాస్‌ గనగోని మాట్లాడుతూ.. ఇండియాలో ఈ నెల 17న వరంగల్‌లో 500 మందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌లు మరియు జనరల్‌ మెడిసిన్‌ ట్రీట్‌మెంట్‌లు చేశాము. 18న ఆశలపల్లిలో మరో 300 మందికి క్యాన్సర్‌ టెస్ట్‌లతో పాటు జనరల్‌ టెస్ట్‌లు కూడా చేసి మందులను ఉచితంగా పంచిము. అలాగే 19న కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శంకర్‌ నేత్రాలయ వారితో కలిసి కంటి ఆపరేషన్లకు సంబంధించి 2300మంది వరకు టెస్ట్‌లు చేశాము. దాదాపు 200 మందికి ఆపరేషన్‌లు నిర్వహించి  100 మందికి ఉచిత కళ్లజోళ్లను పంపిణి చేశాము. మరో 250 మందిని చెన్నైకి పంపించి వైద్యం చేయిస్తున్నాం. ఇదంతా చేయటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని మాట అధ్యక్షుడు శ్రీనివాస్‌ గనగోని అన్నారు. 

ఫెస్టివల్స్‌ ఫర్‌ జోయ్‌ అధ్యక్షురాలు, ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల మాట్లాడుతూ– ‘‘ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయాలంటే ఎంతో మానవత్వం ఉండాలి. అలాంటి మానవత్వం ఉన్న ఎంతో మంది కలిసి చేయబట్టే దాదాపు 2000మందికి పైగా ఈ రోజు ఐ స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేయగలిగారని, దాదాపు 195 ఆపరేషన్లు జరిగినందుకు శంకర్‌ నేత్రాలయ టీమ్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అన్నారు. 

రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ–‘‘ గతంలో నన్ను అందరూ సుమ భర్త అని ఎవరన్నా అంటుంటే చిరగ్గా ఉండేదని ఇప్పుడు సుమ ఇలాంటి మంచిపనులు చేస్తున్నందుకు సుమ భర్త అంటుంటే ఎంతో గర్వంగా ఉందని కాలర్‌ ఎగరేసుకుని మరి సుమ భర్తనే అని చెప్పుకోవాలి అనిపిస్తుంది’’ అన్నారు. కార్యక్రమంలో శంకర్‌ నేత్రాలయ ప్రతినిధి  అరుల్, డాక్టర్‌ విజయ్‌ భాస్కర్‌ బొలగం, ప్రవాసాంధ్రుడు ప్రదీప్‌ సామల టివి ఫెడరేషన్‌ సభ్యులు విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement