మరికల్: వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు ఏదైనా ఆపద వస్తే కార్మిక హెల్ప్లైన్ ఉపయోగించుకోవాలని జన్ సహస్ సంస్థ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ గోపినాథ్ అన్నారు. మండలంలోని మాధవరం గ్రామంలో సోమవారం సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలు, లేబర్కార్డు గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో కార్మికులకు సాయం చేయడానికి మైగ్రేట్స్ రిసిలెంస్ కొలాబరేటివ్, జన్ సహస్ భాగస్వామ్య సంస్థలచే జాతీయ హెల్ప్లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పని చేసే చోట వెట్టిచాకిరీ, మహిళలను వేధించడం, పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోవడం చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1800 1201 1211కు కాల్ చేయాలని సూచించారు. అలాగే లేబర్కార్డు కలిగి ఉన్న కార్మికుడు సహజ మరణం పొందితే రూ,1,30,000, ఇంట్లో ఆడపిల్ల పెళ్లికి రూ.30,000 మహిళ ప్రసూతికి రూ.30,000 వర్థిస్తాయని తెలిపారు. అలాగే ఈ–శ్రమ్ కార్డు, సుకన్య సమృద్ధి పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ పుణ్యశీల, లక్ష్మీకాంత్, అంజాద్ హుస్సేన్ పాల్గొన్నారు.