రైల్వే బోర్డు కీలక నిర్ణయం..సిగ్నలింగ్ వ్యవస్థకు రెండేసి తాళాలు..
Published
Sun, Jun 11 2023 3:12 PM
ఒడిశా:ఒడిశా రైలు ప్రమాద ఘటనతో మేల్కొన్న రైల్వే శాఖ రైళ్ల భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లు నడవడానికి కీలకంగా పనిచేసే సిగ్నలింగ్ వ్యవస్థలను రెండేసి తాళాలు వేసి రక్షించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రిలే రూమ్లు, రిలే హట్లు,లెవల్ క్రాసింగ్ టెలికమ్యునికేషన్ పరికరాలు, ట్రాక్ సర్క్యూట్ సిగ్నల్స్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ పరికరాలు ఉండే వ్యవస్థకు రెండు తాళాలు వేసైనా కాపాడాలని తీర్మానించింది.ఒడిశా రైలు ప్రమాదం జరగడానికి సిగ్నల్ వ్యవస్థలో దుండగులు చొరబడడమే కారణమని ప్రాథమికంగా తేలిన నేపథ్యంలో రైల్వేబోర్డు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
రెండు తాళాలు విధానం తీసుకువచ్చేవరకు ప్రస్తుతం ఉన్న ఒక తాళాన్ని స్టేషన్ మాస్టర్ వద్దే ఉంచాలని రైల్వే బోర్డు తెలిపింది. ఏ తాళాన్ని ఎవరు వేశారు? ఎవరు తీశారు? వంటి అంశాలను ఎప్పటికప్పుడు పేర్కొనే విధంగా ఓ పట్టికతో కూడిన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. కాగా.. ఒడిశా రైలు ప్రమాదంలో 280 మంది మరణించారు. 12 వందలకు పైగా క్షతగాత్రులయ్యారు.