మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

Published Sun, Feb 25 2024 7:38 PM

Prime Minister Modi Inaugurated Mangalagiri Aiims - Sakshi

సాక్షి, అమరావతి: మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్‌(ఎయిమ్స్‌)ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాజ్‌కోట్‌ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు భారతి ప్రవీణ్ పవార్, ప్రహ్లాద్ జోషి, మంత్రి విడదల రజని, ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు పాల్గొన్నారు.

రూ.1618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్‌­ని నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌ క్యాంపస్‌లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌తో పాటు రూ.2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ప్రధాని ప్రారంభించారు.

అలాగే ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌లో భాగంగా రూ.230 కోట్ల విలువైన 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లకు కూడా ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిలో ప్రధానంగా వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం జిల్లా­ల్లోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో రూ.23.75 కోట్ల చొప్పున, తెనాలి జిల్లా ఆస్పత్రిలో రూ.44.50 కోట్లు, హిందూపూర్‌ జిల్లా ఆస్పత్రిలో రూ.22.25 కోట్లతో చేపట్టనున్న క్రిటికల్‌ కేర్‌ బ్లాకుల్ని నిర్మించనున్నారు. 

మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌తో పాటు రాజ్‌కోట్‌ (గుజరాత్‌), రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్‌), బఠిండా (పంజాబ్‌), కల్యాణి (పశ్చిమబెంగాల్‌) నగరాల్లో ఎయిమ్స్‌ ఆస్పత్రులను కూడా ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు.

ఇదీ చదవండి: అసలు ముద్రగడ, పవన్ మధ్య ఏం జరిగింది?

Advertisement
Advertisement