జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్‌.. ఏమన్నారంటే? | Sakshi
Sakshi News home page

జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్‌.. ఏమన్నారంటే?

Published Sun, Sep 3 2023 3:59 PM

Rahul Gandhi Slams Center Over One Nation And One Election - Sakshi

ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ జమిలీ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌పై తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తాజాగా రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో ‘వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ అంటే దేశ ఐక్యత, అన్ని రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచనే అని అన్నారు. భారత్‌ అంటే రాష్ట్రాల సమైఖ్యత అని స్పష్టం చేశారు. ఇక, జమిలీ ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీపై కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాకుండా జమిలీ ఎన్నికల ఆలోచన భారత ఐక్యత, రాష్ట్రాలపై దాడి చేయడమేనని మండిపడింది. అయితే, ముఖ్యంగా కమిటీ ఏర్పాటు చేసిన సమయం, విధివిధానాలను నిర్దేశించిన తీరును చూస్తుంటే సిఫార్సులు కూడా ఇప్పటికే నిర్ణయించినట్లు అని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. కమిటీ కూర్పుపైనా అనుమానాలు ఉన్నాయని.. అందుకే అందులో ఉండేందుకు తమ నేత నిరాకరించారని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది.

మరోవైపు.. జమిలీ ఎన్నికలపై కాంగ్రెస్‌ నేత జయరాం రమేశ్‌ స్పందించారు. ‘జమిలి ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం నామమాత్రపు ప్రక్రియే. దీన్ని ఏర్పాటు చేసిన సమయంపైనా అనుమానాలున్నాయి. దాని నియమ నిబంధనలను చూస్తే కమిటీ సిఫార్సులను ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి ఆ కమిటీలో ఉండేందుకు నిరాకరించడం సరైనదే’ అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: గ్యాస్ సిలిండర్ ధర రూ.3000 వరకు పెరుగుతుంది

Advertisement
Advertisement