ఆ ముగ్గుర్నీ కలిశాకే ఈ నిర్ణయం తీసుకున్నా!..ఎప్పటికీ స్వెటర్స్‌ వేసుకోను: రాహుల్‌ గాంధీ

10 Jan, 2023 13:17 IST|Sakshi

భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ టీషర్ట్స్‌ ధరించడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అదీ కూడా శీతాకాలంలో ఇంత భయంకరమైన చలిలో సైతం రాహుల్‌ ఎందుకు టీషర్ట్స్‌ వేసుకుంటున్నారంటూ మీడియాతో సహా సర్వత్ర ఇదే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఈ విషయమై స్పందించారు. తాను ముగ్గురు బాలికలను కలిసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ఆ చర్చలకు తెరదించారు.

వారిని కలిసిన తర్వాత నుంచే టీ షర్టులు ధరించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందరూ ఈ టీ షర్ట్‌ ఎందుకు ధరిస్తున్నారు చలిగా అనిపించడం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. "ఐతే నేను కేరళలో ‍ప్రవేశించినప్పుడూ కాస్త వేడిగ, తేమగా ఉంది. కానీ మధ్యప్రదేశ్‌లోకి వచ్చేటప్పటికీ కాస్త చల్లగా ఉంది. అప్పుడే అక్కడకి చిరిగిన బట్లతో ముగ్గురు పేద బాలికలు నా దగ్గరికి వచ్చారు. సరైన దుస్తులు ధరించకపోవడంతో చలికి గజగజ వణకుతున్నారు. దీంతో ఆరోజు నేను నిర్ణయించుకున్నా వారికి చలి అనిపించేంత వరకు(వారు స్వెటర్లు ధరించేంత వరకు) తనకు చలి అనిపించదు. అప్పటి వరకు నేను కూడా స్వెటర్స్‌ ధరించను. అంతేకాదు ఆ ముగ్గురు బాలికలకు చలి అనిపిస్తే రాహుల్‌కి కూడా చలి అనిపిస్తుందని ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పారు.

అయినా తాను టీషర్ట్స్‌ వేసుకోవడం అనేది ప్రధానాంశం కాదని, ఈ యాత్రలో తన వెంట వస్తున్న పేద రైతులు, కూలీలపై దృష్టి పెట్టండని మీడియాకి చురకలంటించారు. పేద రైతులు, కార్మికులు, వారి పిల్లలు చిరిగిని బట్టలు, టీషర్ట్‌లు, స్వెటర్లు ధరించకుండా ఎందుకు ఉన్నారో అనేది ప్రధానం, దాని గురించే ఆలోచించండి." అని చెప్పారు రాహుల్‌. కాగా జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌లలో జరిగింది. జనవరి 30 కల్లా జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కి చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది. 

(చదవండి: ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్‌ గాంధీ)

మరిన్ని వార్తలు