వారి పేరు, ఫొటోలు వాడకండి.. అజిత్‌ పవార్‌ వర్గానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు | Sakshi
Sakshi News home page

వారి పేరు, ఫొటోలు వాడకండి.. అజిత్‌ పవార్‌ వర్గానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

Published Thu, Mar 14 2024 5:29 PM

Why Use Sharad Pawar Photos Asking Supreme Court - Sakshi

రాజకీయ ప్రయోజనాల కోసం పేరు, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ.. శరద్‌ పవార్‌ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీకి సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. శరద్ పవార్ పేరు, చిత్రాలను ఉపయోగించబోమని హామీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ స్థాపించిన ఎన్‌సీపీ గత ఏడాది జూలైలో అజిత్ పవార్.. ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన తర్వాత చీలిపోయింది. ప్రత్యేకంగా పార్టీ ఉన్నప్పుడు శరద్‌ పవార్‌ ఫొటోను ఎందుకు వినియోగిస్తున్నారని అజిత్‌ వర్గాన్ని కోర్టు ప్రశ్నించింది. మీరు సొంత పార్టీ గుర్తింపుతో ముందుకు వెళ్ళాలి అని సుప్రీంకోర్టు అజిత్‌ వర్గానికి సూచించింది.

అజిత్‌ పవర్‌ వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది మణిందర్‌ సింగ్‌ వాదనలు వినిపిస్తూ.. పార్టీ శరద్‌ పవార్‌ పేరును ఉపయోగించడం లేదని, కొందరు గుర్తు తెలియని కార్యకర్తలే ఈ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో కార్యకర్తలను నిలువరించడం సాధ్యం కాదని అజిత్‌ వర్గం పేర్కొన్నారు.

అజిత్‌ వర్గం వాదనలు విన్న తరువాత.. మీ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ కోర్టు స్పష్టం చేసింది. రెండు పార్టీలుగా విడిపోయిన తరువాత తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాల్సిన అవసరం చాలా ఉందని వెల్లడించారు.

శరద్‌ పవార్‌ వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ కోర్టులు వాదనలు వినిపిస్తూ.. అజిత్‌ వర్గం ఎన్‌సీపీ ఎన్నికల గుర్తు గడియారాన్ని ఉపయోగిస్తుందని తెలిపారు. ఆ గుర్తుకు శరద్‌ పవార్‌కు ఉన్న రాజకీయ బంధం గురించి అందరికి తెలుసని అన్నారు.

Advertisement
Advertisement