మన్‌కీబాత్‌ కార్యక్రమంలో అనూహ్య ఘటన..ఓ మహిళకి నొప్పులు రావడంతో.. | Sakshi
Sakshi News home page

మన్‌కీబాత్‌ కార్యక్రమంలో అనూహ్య ఘటన..ఓ మహిళకి నొప్పులు రావడంతో..

Published Mon, May 1 2023 9:15 AM

Woman Goes Into Labour Pain At Mann Ki Baat Gave Birth To Baby Boy - Sakshi

డిల్లీలో జరిగిన మన్‌ కీ బాత్‌ 100వ ఎపీసోడ్‌ని బీజేపీ కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా 11 విదేశీ భాషల తోపాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో కూడా అట్టహాసంగా ప్రసారమైంది. ఐతే ఎంతో విజయవంతంగా నిర్వహించిన ఈ మన్‌కిబాత్‌ కార్యక్రమంలో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన  24 ఏళ్ల పూనమ్‌ దేవికి అకస్మాత్తుగా నొప్పులు రావడం మొదలైంది. దీంతో పూనమ్‌ను హుటాహుటినా రాజధానిలోని ఆస్పత్రికి తరలించారు ఆమె భర్త. పూనమ్‌ ఉత్తరప్రదేశ్‌లోని స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళ. 

ఆమెకు అదేరోజు(ఆదివారం) సాయంత్రం 6.42 నిమిషాలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజధానిలోనే తమ బిడ్డ పుట్టడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ బిడ్డకు ఆదిత్య అని పేరు పెట్టుకుంటామని పూనమ్‌ భర్త ప్రమోద్‌ కుమార్‌ చెప్పారు. సదరు మహిళ పూనమ్‌ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా రాజధాని ఢిల్లీకి వచ్చారు. అంతేగాదు ప్రధాని నరేంద్ర మోదీ తన నెలవారీ మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌లలో ఒక ఎపిసోడ్‌లో మహిళలకు ఆదాయపు వనరులను సృష్టించడం కోసం  ఆమె చేసిన కృషి, సాధించిన విజయాల గురించి ప్రసంసించడం విశేషం.

ఐతే తన భార్య గర్భం దాల్చడంతో రాజధానికి వెళ్లేందుకు తాను అంగీకరించలేదని ఆమె భర్త పేర్కొన్నారు. ఐతే తన భార్య స్వయం సహాయక బృందంలో తను చేసిన పనిని గుర్తించారని, దాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమానికి వెళ్లాలంటూ పట్టుబట్టడంతో వచ్చినట్లు ఆమె భర్త చెప్పారు. పూనమ్‌ లఖింపూర్‌ ఖేరీలోని సమైసా గ్రామంలో సరస్వతి ప్రేరణ గ్రామ్‌ సంగతన్‌ అనే స్వయం సహాయక బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఆమె అరటి కాండం నుంచే వచ్చే ఫైబర్‌తో హ్యాండ్‌బ్యాగ్‌ల, చాపలు వంటి ఇతర వస్తువులను ఉత్పత్తి చేస్తోంది.

ఇది గ్రామంలోని మహిళలకు మంచి అదనపు ఆదాయ వనరులను అందించడమే గాక గ్రామంలో వ్యర్థాలను తొలగించడానికి కూడా దోహదపడింది. ఈ మేరకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన 100 మంది ఆహ్వానితుల్లో ఆమె కూడ ఒకరు. ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్‌ ఎపిసోడ్‌లో సమాజానికి విశేషమైన సహాయ సహకారాలు అందించిన వారి గురించి మాట్లాడుతున్నప్పుడూ.. ఆమె గురించి కూడా ప్రస్తావించారు. కాగా, ఆదివారం జరిగిన 100వ ఎపిసోడ్‌ మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని బీజేపీ ఉపాధ్యక్షుడు జగదీప్‌ ధంకర్‌ ప్రారంభించారు. ఈ కార్యకమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌, సమాచార  ‍ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తదితరులు పాల్గొన్నారు. 

(చదవండి: గుజరాత్‌ సీఎం ప్రసంగిస్తుండగా ఆఫీసర్‌ కునుకు.. ఆ కమిట్‌మెంట్‌కు ఫలితంగా..)

Advertisement
Advertisement