ఆకాశం కొంతమేరక మేఘావృతమవుతుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది.
కేసీఆర్ సభను విజయవంతం చేయాలి
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలో జూన్ 4న నిర్వహించే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్లో నిర్మల్ నియోజకవర్గస్థాయి ముఖ్యకార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూన్ 4న నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం, పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారని తెలిపారు. సభకు పెద్దఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని ఆయనపై అభిమానంతో ప్రజలు భారీగా సమావేశానికి హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకటరాంరెడ్డి, నాయకులు అల్లోల మురళీధర్రెడ్డి, గౌతమ్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మరుగొండ రాము, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.
మాట నిలబెట్టుకున్న కేసీఆర్
నిర్మల్ టౌన్: రాష్ట్రంలో అన్ని శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని, ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. వైద్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఎంపీహెచ్ఏ, ఫార్మసిస్ట్ ఉద్యోగులను ప్రభుత్వం ఇటీవలే క్రమబద్ధీకరణ చేసింది. ఈ సందర్భంగా వారు జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఐకేరెడ్డిని మంగళవారం కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రితో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేని పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. నిర్మల్కు మెడికల్ కాలేజ్ వచ్చిందని, త్వరలో నర్సింగ్ కాలేజ్ కూడా వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాల ప్రజల కోసం ప్రతీ జిల్లాకు ఒక కోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అదేవిధంగా మతాలకు అతీతంగా ప్రార్థన మందిరాలు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.