ఇంద్రవెల్లి: మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా ఆదివాసీ గ్రామాల్లో దండారీ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివాసీలు భక్తి శ్రద్ధలతో యేత్మసార్ దేవతలను కొలుస్తూ పూజలు చేయడంతో పాటు కోలాటం, గుస్సాడీ, మహిళలు, యువతులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇతర గ్రామాల దండారీ బృందాన్ని తమ గ్రామాలకు అతిథులుగా ఆహ్వానించి మర్యాదలు చేస్తున్నారు. శనివారం మండలంలోని పొల్లుగూడ గ్రామానికి లింగపూర్ గ్రామా దండారీ బృందం అతిథులుగా వెళ్లారు. అదేవిధంగా పొల్లుగూడ గ్రామం దండారీ బృందం రాత్రి మండలంలోని పిప్రి లుక్కుగూడ గ్రామానికి అతిథులుగా వెళ్లారు. ఈ సందర్భంగా సంప్రదాయ వాయిద్యాల మధ్య గుస్సాడీలు, యువకులు, మహిళలు, యువుతులు చేసిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆదివాసీ పెద్దలు కోరెంగా శంభు, ఆత్రం శంకర్, జుగ్నాక్ మహదు, కోరెంగా లింగు, మర్సుకోల నాందేవ్, జుగ్నాక్ భరత్ ఉన్నారు.