సీఎం సారూ.. సమస్యలివీ! ప్రజల వినతి.. | Sakshi
Sakshi News home page

సీఎం సారూ.. సమస్యలివీ! ప్రజల వినతి..

Published Wed, Jan 31 2024 11:36 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌/నిర్మల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు వస్తున్న ఎనుముల రేవంత్‌రెడ్డిపై ఇక్కడి ప్రజలు ఎ న్నో ఆశలు పెట్టుకున్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు సంబంధించి అధికారులు, అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం పర్యటన సందర్భంగా ఇక్కడి అభివృద్ధి కోసం నిధుల ప్రకటన, కొత్త పనుల కోసం హామీలు ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక సమస్యలు ఉన్నాయి.

సాగునీటి ప్రాజెక్టులకు నిధులు..
ఉమ్మడి జిల్లాలో సరైన సాగునీటి ప్రాజెక్టులు లేక ఇంకా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నీటి వనరులున్నా సమర్థవంతంగా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రధాన ప్రాజెక్టులైన కడెం, సరస్వతి కాలువ(ఎస్సారెస్పీ) ఆధునీకరించాల్సి ఉంది. మధ్యతరహా ప్రాజెక్టుల్లో స్వర్ణ, వట్టివాగు, సాత్నాల, ఎన్టీఆర్‌, పీపీ రావు ప్రాజెక్టు, గడ్డెన్నవాగు, సదర్మాట్‌ ఉన్నాయి. కుమురంభీం జిల్లా పరిధిలో కుమురంభీం ప్రాజెక్టు కాలువలు పూర్తి చేయాల్సి ఉంది.

తాంసిలో మత్తడివాగు, పెన్‌గంగా ప్రాజెక్టు, హాజీపూర్‌ మండలం ముల్కల్లలోని ర్యాలీవాగు, వేమనపల్లి మండలం నీల్వాయి, భీమారంలో గొల్లవాగు ప్రాజెక్టులు ఉన్నాయి. గత కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై ఉన్న డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పక్కనపెట్టింది.

తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాకతో ఈ ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు పెరిగాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలో ప్రాణహిత, గోదావరి తీర ప్రాంత రైతుల పంటలు ఏటా నీట మునుగుతున్నాయి. వీటి కోసం శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉంది. మంచిర్యాల, నస్పూర్‌ పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు వరదలు వచ్చి ముంపునకు గురవుతున్నాయి.

గిరిజనుల గోస..
ఉమ్మడి జిల్లా ఏజెన్సీ పరిధిలో గిరిజనులకు ఇప్పటికీ అటవీ సమీప గ్రామాలకు సౌకర్యాల్లేవు. చాలా చోట్ల విద్య, వైద్యం, తాగునీరు, అన్ని కాలాల్లో రవాణాకు రోడ్లు అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఇంద్రవెల్లి, నార్నూర్‌, జైపూర్‌, లింగాపూర్‌ మండలాల్లో వానాకాలాల్లో ఇప్పటికీ మట్టిరోడ్లే దిక్కవుతున్నాయి. పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అటవీ అనుమతులు రాక పనులు ముందుకు సాగడం లేదు.

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక కేంద్రాలు, సామాజిక ఆస్పత్రుల్లో సరిపడా వైద్య సిబ్బంది లేక అరకొర వైద్యం అందుతోంది. ఏజెన్సీలో సౌకర్యాలు మెరుగుపర్చాల్సి ఉంది. జిల్లా కేంద్రాల్లో ప్రధాన ఆస్పత్రులతోపాటు ఆదిలా బాద్‌ రిమ్స్‌లోనూ సిబ్బంది ఖాళీలతో వైద్యంపై ప్రభావం పడుతోంది. ఉట్నూరు ఐటీడీఏను సమగ్రంగా ప్రక్షాళన చేయాల్సి ఉంది. నాలుగు జిల్లాల విస్తరణతో పరిపాలనలో సమస్యలు వస్తున్నాయి. ఆసిఫాబాద్‌లో మినీ ఐటీడీఏ ఏర్పాటు కార్యాచరణ దాల్చలేదు.

గిరిజనేతరులకు..
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఉద్యోగ, ఉపాధి, విద్యాసంస్థల్లో అవకాశాలు తక్కువగా ఉన్నా యి. అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు మాత్రమే పోడు పత్రాలు ఇవ్వడంతో గిరిజనేతరులకు సైతం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. పోడు హక్కు పత్రాలు తమకు కూడా ఇవ్వాలని వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు.

సింగరేణి ప్రాంతంలో కార్మికులకు..
సింగరేణి ప్రాంతంలో కొత్త గనుల ప్రారంభం, ఓపెన్‌ కాస్టుల స్థానంలో భూగర్భ గనులు ప్రారంభించాలనే ప్రతిపాదనలు అటకెక్కాయి. దీంతో ఉపాధి అవకాశాలు తగ్గి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పెరుగుతున్నారు.

మున్సిపాలిటీల్లో..
ఉమ్మడి జిల్లాలో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌, ఆది లాబాద్‌, కాగజ్‌నగర్‌, మంచిర్యాల, లక్సెట్టిపేట, నస్పూర్‌, చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి, బె ల్లంపల్లి పట్టణాలున్నాయి. వీటి పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. పట్టణ వాసులకు తాగునీరు, రోడ్లు, మౌలిక వసతులు అరకొరగా అందుతున్నా యి. ఇక ఉట్నూరు, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలు గా అప్‌గ్రేడ్‌ చేసినప్పటికీ ఇంకా గ్రామ పంచాయతీ లుగానే కొనసాగుతున్నాయి.

జిల్లా కేంద్రంగా ఉన్న ఆసిఫాబాద్‌కు మున్సిపాలిటీ హోదా దక్కలేదు. ఇక మందమర్రి పట్టణంలో ఏజెన్సీ వివాదంతో ఎన్నికలు జరగడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి చొర వ చూపాలని కోరుతున్నారు. ఇక గ్రామ పంచాయతీలకు నిధులు, సర్పంచులకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు పూర్తి చేయాల్సి ఉంది.

ఇవి చదవండి: ఇష్టంతో ఉమ్మడి జిల్లాకు వచ్చా! : మంత్రి సీతక్క

Advertisement
Advertisement