కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలపై ప్రశాంత్‌ కిశోర్‌ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

Prashant Kishor: కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలపై ప్రశాంత్‌ కిశోర్‌ కీలక వ్యాఖ్యలు

Published Fri, Dec 3 2021 6:24 AM

Congress leadership not divine right of an individual - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం వహించడం ఏ వ్యక్తికి దైవదత్తంగా సంక్రమించే హక్కు కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. గత పదేళ్ల కాలంలో 90 శాతానికి పైగా ఎన్నికల్లో ఓడిపోయిన ఒక పార్టీకి నేతృత్వం వహించే  హక్కు దానంతట అదే రాదని పేర్కొన్నారు. మమతా బెనర్జీ యూపీఏ కూటమి లేదంటూ కామెంట్లు చేసిన మర్నాడు గురువారం రాహుల్‌గాంధీపై ప్రశాంత్‌ కిశోర్‌ ట్విట్టర్‌ వేదికగా మాటల దాడికి దిగారు. దేశ రాజకీయ ముఖచిత్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఒక స్థానం ఉందని,  ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌ అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ప్రతిపక్ష కూటమికి సారథి ఎన్నిక  ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ లేని కూటమి ఆత్మ లేని శరీరమే: సిబల్‌
యూపీఏ కూటమే లేదంటూ మమత చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ లేని యూపీఏ అంటే ఆత్మ లేని శరీరం వంటిదన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి తమ సత్తా చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.  ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన వ్యాఖ్యలనూ తిప్పికొట్టారు. ఇతర పార్టీల ఎజెండా ఏంటో ప్రశాంత్‌ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో సలహాలిచ్చుకునే స్వేచ్ఛ ఆయనకు ఉందని,  కానీ మరో పార్టీ ఎజెండాపై ఎలా మాట్లాడాతారని నిలదీశారు.‘మమతది పచ్చి రాజకీయ అవకాశవాదం. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలను ఎదుర్కొంటున్నట్లు నటిస్తూ అదే ఫాసిస్టు శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారు’ అని రణ్‌దీప్‌ సూర్జేవాలా ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement