‘కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు..’ | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు..’

Published Tue, Mar 12 2024 2:17 PM

Ex Minister Kodali Nani Comments On Sharmila And Chandrababu - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్.. సీఎం జగన్‌ను ఏమీ చేయలేరన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  చంద్రబాబు, పవన్, షర్మిల, పురందేశ్వరి తీరును ఎండగట్టారు. మోదీని నానా బూతులు తిట్టింది చంద్రబాబు కాదా?. ఈ దేశాన్ని దోచుకున్నది మోదీ అని చెప్పింది చంద్రబాబు కాదా?. పాచిపోయిన లడ్డూలిచ్చారన్నది పవన్ కాదా?. నా తల్లిని దూషించారు.. టీడీపీ అంతం చూస్తానని పవన్ ప్రగల్భాలు పలికాడు’’ అని కొడాలి నాని గుర్తు చేశారు.

రాష్ట్రం ఏం విధ్వంసం అయిపోయిందని మీరంతా కలిశారు. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనమైపోయిందా?. పోర్టులు, జెట్టీలు, మెడికల్ కాలేజీలు నిర్మించినందుకు రాష్ట్రం నాశనమైపోయిందా?. రైతులకు, మహిళలకు రుణమాఫీ ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఒకరిని ఒకరు తిట్టుకుని సిగ్గులేకుండా ఇప్పుడు అంతా కలిసి వస్తున్నారు. సీఎం జగన్‌ను ఓడించడమే అన్ని పార్టీల ఆశయం. పవన్ సిగ్గులేకుండా 21 సీట్లకు వచ్చాడు. పార్టీని పెట్టింది దేనికి అడుక్కోవడానికా?. ఈయన్ని నమ్ముకున్నవాళ్లందరికీ పవన్ ఏం చెప్తాడు. జనసేన ఓట్లు చంద్రబాబుకు బదిలీ అయ్యే పరిస్థితి లేదు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అట్టర్ ప్లాప్’’ అంటూ కొడాలి నాని దుయ్యబట్టారు.

‘‘చంద్రబాబుకు ఈ సారి 23 సీట్లు కూడా రావు. షర్మిల ఎవరికోసం ప్రచారం చేస్తారు. ఎవరు గెలవాలని షర్మిల కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌లో ఉండి బీజేపీలో ఉన్న చంద్రబాబును గెలిపించడానికి షర్మిల ప్రయత్నిస్తోంది. మణిపూర్ ఊచకోతకు ఏపీలో ఉన్న సీఎం జగన్‌కు ఏం సంబంధం?. తెలంగాణలో తిరిగినప్పుడు షర్మిలకు మణిపూర్ గుర్తుకురాలేదా?. పాస్టర్ అని చెప్పుకునే బ్రదర్ అనీల్ మణిపూర్ వెళ్లాడా?. రాహుల్, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మణిపూర్ వెళ్లారా?. బీజేపీ క్రైస్తవులను ఊచకోత కోశారని మీరు చెబుతున్నారు. నరేంద్రమోదీని ఏపీలో కాలు పెట్టనివ్వనన్నది చంద్రబాబు కాదా?’ అంటూ కొడాలి ప్రశ్నల వర్షం కురిపించారు. 

బీజేపీతో కలిసి తప్పుచేశానన్న చంద్రబాబు సిగ్గులేకుండా మోదీతో ఎలా కలిశాడు?. తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఎన్టీఆర్ టీడీపీని పెట్టాడు. చంద్రబాబు తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టాడు. ఏపీలో కాంగ్రెస్ జెండా పట్టుకునేవాడు కూడా లేడు. ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టింది. ఆ పార్టీని హుస్సేన్ సాగర్‌లో కలిపేసి ఏపీకి వచ్చి సీఎం జగన్‌ని సాధించాలని చూస్తోంది. కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. .ఏపీలో కాంగ్రెస్ పార్టీ డిస్పోజబుల్ పార్టీ. డిపాజిట్లు కూడా రానోళ్లు 5 వేలు మహిళలకు ఇస్తారంటే నమ్మడానికి జనం పిచ్చోళ్లా..’’ అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: లోలోన కుమిలిపోతూనే.. పవర్‌ లెస్‌గా పవన్‌ కల్యాణ్‌ 

Advertisement
Advertisement