బెంగళూరు: కర్ణాటకాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తమను నెలనెలా లంచం సమర్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి ఒత్తిడి చేస్తున్నారని సంబంధిత శాఖ డైరెక్టర్లు రాసిన లేఖ ఒకటి బయటపడింది. అది నకిలీదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రిపై దర్యాప్తు చేయడానికి సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు సీఎం సిద్ధరామయ్య.
రాష్ట్ర వ్యవసాయ మంత్రి చలువరాయ స్వామి నెలకు రూ.8 లక్షల వరకు లంచం సమర్పించాలని ఆ శాఖకు చెందిన డైరెక్టర్లను ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్కు బాధిత డైరెక్టర్లు ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖ ఒకటి బయటపడింది. ఇలా ఒత్తిడి చేస్తే తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందంటూ బాధితులు గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు సిద్ధరామయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతికి మారుపేరుగా ప్రభుత్వం మారిపోయిందని బీజేపీ ఆరోపించింది.
దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. ఇది ప్రతిపక్షాల కుట్రగా పేర్కొన్నారు. ఆ లేఖ నకిలీదని గుర్తించినట్లు చెప్పారు. తన ప్రభుత్వంపై బురదజల్లడానికి బీజేపీ, జేడీఎస్లు ఆడిన నాటకని అన్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన మహా ఎంపీ..