Minister Kishan Reddy Slams On KCR Over Farmers Deeksha - Sakshi
Sakshi News home page

Minister Kishan Reddy: కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు గుణపాఠం చెబుతారు: కిషన్‌రెడ్డి

Published Wed, Apr 13 2022 4:19 PM

Minister Kishan Reddy Slams On KCR Over Farmers Deeksha - Sakshi

సాక్షి, ఢిల్లీ: టీఆర్ఎస్ పార్టీ చేసిన దీక్ష రైతు దీక్ష కాదని అది రాజకీయ దీక్ష అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చాలా ముఖ్యమంత్రులు వ్యవహరించినట్లు సీఎం కేసీఆర్ వ్యవహరిస్తే హుందాగా ఉండేదని అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే కేసీఆర్ ఇన్ని రోజులు డ్రామాలు చేశారని దుయ్యబట్టారు. దానిని రైతులు అర్థం చేసుకున్నారుని, అందుకే నిజమైన రైతు ఒక్కరూ భాగస్వాములు కాలేదని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ డ్రామాలు చేయకుండా ఉంటే బాగుంటుందని హితవు పలికారు.  కల్వకుంట్ల కుటుంబం డ్రామాలు ఆపాలని.. లేకుంటే రైతులే వారి డ్రామాలకు తెరదింపుతారని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి డ్రామాలు చేస్తే.. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. 

ప్రపంచ దేశాలను అబ్బుర పరిచేలా..
ఆజాద్‌ కి అమృత్ మహోత్సవం సందర్భంగా ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్ని రాష్ట్రాల పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు, సెక్రెటరీలతో, అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆజాద్ కి అమృత్  మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కల్చరల్ మినిస్ట్రీ తరఫున దేశ వ్యాప్తంగా ఆజాద్ కి అమృత మహోత్సవ కార్యక్రమాలు జరుపుతున్నామని చెప్పారు. స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను ఇప్పుడున్న తరానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. టీవీల షోలో సీరియల్ ద్వారా వివిధ సోషల్ మీడియాలో వారి జీవితాల గురించి  వీడియోలను తీస్తున్నామని చెప్పారు.

జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో, 75 చోట్ల యోగా కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆగస్టు 15న దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలిపునిచ్చారు. ప్రతి ఇంటి మీద భారతీయ జెండా, కుటుంబ సమేతంగా జాతీయ గీతం పడాలని తెలిపారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రతి రాష్ట్రం, అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ప్రపంచ దేశాలను అబ్బుర పరిచేలా ఈ కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ఇప్పటివరకు దేశానికి 14 మంది ప్రధానమంత్రులు అయ్యారని, 14 మంది ప్రధాన మంత్రుల పేరుతో తీన్మూర్తి భవన్‌లో ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం ఏర్పాటు చేశామని చెప్పారు. రేపు(గురువారం) ప్రధానమంత్రి చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement