ఓటమి భయంతోనే బద్నాం చేస్తున్నారు | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే బద్నాం చేస్తున్నారు

Published Tue, Oct 31 2023 3:05 AM

Revanth Reddy Comments on BRS and BJP - Sakshi

అంబర్‌పేట (హైదరాబాద్‌): పొడిచిన వ్యక్తి బీజేపీ.. కత్తిపోటుకు గురైన వ్యక్తి బీఆర్‌ఎస్‌ నేత అయితే సీఎం కేసీఆర్‌ మాత్రం కాంగ్రెస్‌ను బద్నాం చేయడం ఆయన ఓటమి భయానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం అంబర్‌పేట పార్టీ అభ్యర్థి రోహిన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన వి.హనుమంతరావుతో కలిసి మాట్లాడారు. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలతో కుట్ర చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సమ­క్షంలో బీజేపీలో చేరిన వ్యక్తి.. బీఆర్‌ఎస్‌ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేస్తే ఇది కాంగ్రెస్‌ పని అని సీఎం కేసీఆర్‌ దివాలాకోరు ఆరోపణలు చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మహాత్మాగాంధీ సిద్ధాంతాలతో పని చేస్తుందని, శాంతియుత వాతావరణంలో తాము ఎన్నికల్లో కొట్లాడుతామని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అంబర్‌పేటను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని రేవంత్‌ హామీఇచ్చారు.

వీహెచ్‌ మాట్లాడుతూ తన హయాంలోనే అంబర్‌పేట చెప్పుకోదగ్గ అభివృద్ధి చెందిందని తెలిపారు. టికెట్ల విషయంలో పార్టీ నేతలకు జరిగిన అన్యాయాన్ని అధికారంలోకి వచ్చాక న్యాయం చేయాలని వీహెచ్‌ రేవంత్‌రెడ్డిని కోరారు. కాంగ్రెస్‌ ఇచి్చన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించి అంబర్‌పేటలో విజ­యం సాధిస్తామని రోహిన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పలువురు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీ­లో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ కార్పొరేటర్లు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement