బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య సంధి కుదిరిందా?: కిషన్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య సంధి కుదిరిందా?: కిషన్‌రెడ్డి

Published Tue, Jan 2 2024 2:00 PM

Telangana Bjp Chief Kishan Reddy Comments On Brs And Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరంపై కాంగ్రెస్‌ సర్కార్‌ ఏం చేయబోతుంది అంటూ ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. మంగళవారం ఆయన హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కేసీఆర్‌ చేసిన అతిపెద్ద స్కాం అని ధ్వజమెత్తారు.. కేసీఆర్‌ రీ ఇంజనీరింగ్‌ కాస్తా రివర్స్‌ ఇంజనీర్‌గా మారిందని మండిపడ్డారు.ఇంజనీరింగ్‌ మార్వల్‌గా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మూడు, నాలుగు ఏళ్లలోనే కుంగిపోయిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు భవిత్యం ఏంటనేది తెలియడం లేదని అన్నారు.

కుంగిపోయిన పిల్లర్లను మళ్ళీ కడతారా? లేక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు కిషన్‌ రెడ్డి. కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతోందని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా దీనిపై సీబీఐ దర్యాప్తు చేయవద్దనే చట్టాన్ని బీఆర్‌ఎస్‌ తీసుకువచ్చిందన్న ఆయన.. కాంగ్రెస్ అయినా ఆ చట్టాన్ని తీసివేసి దర్యాప్తు చేస్తుందా? లేక బీఆర్ఎస్‌ను కాపాడుతుందా? అని ప్రశ్నించారు. 

‘కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరాలి... దర్యాప్తు కోరిన 48 గంటల్లోనే విచారణ జరిగేలా సిఫార్పు చేస్తాం. సీబీఐ దర్యాప్తు కోరకుంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో చర్చిస్తాం. తాము సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య సంధి కుదిరిందా?. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకటి కాదని నిరూపించుకోవాలి. అందు కోసం అయినా సీబీఐ దర్యాప్తు కోరాలి. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉందా? లేదా?. రేవంత్ రెడ్డి.. దోషులకు శిక్ష పడాలని ఉందా? లేదా?. ఉంటే దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయాలి’ అని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: TS: వాహనదారులకు హెచ్చరిక.. ఆ వెబ్‌సైట్‌లో చలాన్లు కడితే ఇక అంతే..

Advertisement
Advertisement