కేసీఆర్‌ అవినీతిపై ఈడీ, సీబీఐ ఫోకస్‌ ఎందుకు లేదు: రాహుల్‌ ఫైర్‌ | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారంలో స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌.. పలు కార్యక్రమాల అప్‌డేట్స్‌

Published Thu, Oct 19 2023 9:03 AM

Telangana Congress Leaders In Election Campaign Live Updates - Sakshi

Updates..

కాటారంలో ర్యాలీ సందర్బంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ, కేసీఆర్‌ కలిసి పనిచేస్తున్నారు. అవినీతి కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అవినీతిని పక్క రాష్ట్రాలకు విస్తరించారు. మీ ఉత్సాహం చూస్తుంటే కేసీఆర్‌ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్‌ అవినీతిపై బీజేపీ ఎందుకు దర్యాప్తు జరపడం లేదు. తెలంగాణలో కుటుంబ పాలన సాగింది. అవినీతి కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం.. కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తున్నాయి. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ అవినీతిపై ఈడీ, సీబీఐ ఎందుకు ఫోకస్‌ పెట్టడం లేదు. జన గణన చేయాలని మేం అడుగుతున్నాం. పదేళ్లుగా కేసీఆర్‌ ప్రజలకు దూరమవుతూ వచ్చారు. పార్లమెంట్‌లో కుల, జన గణన మీద మాట్లాడాను. దేశంలో పెద్ద అంశం కులాలవారీగా జన సమీకరణ.  

నాపై 24 కేసులు పెట్టారు. 90 మంది కీలక అధికారుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారని అడిగా?. ఎస్సీ, ఎస్టీ అధికారులు ఎంతమంది ఉన్నారని అడిగా. దేశాన్ని నడిపించే వారిలో మెజార్టీ ఎవరని అడిగాను. కేవలం ముగ్గురే ఓబీసీ అధికారులున్నారు. దేశంలో బడా వ్యాపారులకు అప్పులు మాఫీ చేస్తున్నారు. 

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కాటారంలో రైతులతో భేటీ అయ్యారు. 
అనంతరం, కేటీకే 5వ బొగ్గు గని నుంచి బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో రాహుల్‌ బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. 

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ బస్సు యాత్ర కొనసాగుతోంది. నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రాహుల్‌ గాంధీ పర్యటించనున్నారు. ఇక, గురువారం కాంగ్రెస్‌ నేతలు సింగరేణి కార్మికులతో సమావేశమై.. వారితో చర్చించారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో భేటీ సందర్బంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి దివాళా తీయడానికి  విద్యుత్‌ సంస్థలకు బకాయి పడ్డ వేలాది కోట్లే కారణం కాదా?. ఉచిత విద్యుత్‌తో జెన్‌కో, ట్రాన్స్‌కో కు ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించడం లేదు. జెన్‌కోకు ఎనిమిదేళ్లు సీఎండిగా ఒక్కడే ఉన్నాడు. ఐఏఎస్‌ల్లో సమర్థులు లేరా?. ఎందులో అయినా కేసీఆర్ దోస్తులు, కుటుంబ సభ్యులే ఉంటారు.

ప్రధాని మోదీ.. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నాడని కేసీఆర్‌ అంటున్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే బిల్లు 2015లో వచ్చింది. అప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు ఎంపీగా ఉన్న కవిత మద్దతు తెలిపారు. సింగరేణి ప్రైవేట్ పరం కావడానికి కారణం ఏవరో అర్థం చేసుకోవాలి. లోపాయికారీ ఒప్పందంతో తాడిచర్ల ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని ప్రైవేట్ పరం చేశారు. జెన్‌కో నుంచి రావాల్సిన బకాయి ఇప్పించడంలో విఫలం కావడంతోనే సింగరేణి ఎన్నికలను వాయిదా వేయించారు. 
రాజకీయ పార్టీలు తెలంగాణ సాధనలో విఫలమైతే జానారెడ్డి ఇంట్లో అన్ని పార్టీలు సమావేశమై జేఏసీ ఏర్పడింది. సకల జనుల సమ్మెతో తెలంగాణ ఏర్పడింది. 

సింగరేణి కార్మికుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించింది. కార్మికుల వైపు వాళ్ళే ఉంటారు.. ప్రభుత్వంలో వాళ్ళే ఉంటారు. ఎంపీగా ఓడిన కవిత సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. వినోద్ కుమార్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అయ్యాడు. అఆలు సరిగా రాయలేని దద్దమ్మ దయాకర్ రావు  మంత్రి అయ్యాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సీఎం కేసీఆర్‌ ఓసీపీలను మూసివేయాలని చూస్తున్నారు. సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంది. సింగరేణి ని కాపాడటానికి, కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చడానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. 

పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల పేరు మార్పిడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారంలో పూర్తి చేస్తాం. ఆదాయ పన్ను పరిమితి పెంచుతాం. పెన్షన్‌తోపాటు సొంత ఇంటి కల నెరవేర్చుతాం. సీఎం కేసీఆర్ చైనా బార్డర్‌లో ఉండే సైనికులతో సింగరేణి కార్మికులను పోల్చి మాటలతో బోల్తా కొట్టిస్తాడు.. కానీ కార్మికులకు రావాల్సిన రాయితీలు ఇవ్వరు. వాస్తవాలను గ్రహించి కాంగ్రెస్‌ను గెలిపించండి.

మధు యాష్కీ మాట్లాడుతూ.. సింగరేణిలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామన్నారు. 

Advertisement
Advertisement