ఒంగోలు అర్బన్: వచ్చే ఏప్రిల్ నెలలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రకాశం భవనంలో టెన్త్ పరీక్షల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద ఆర్మ్డ్ గార్డ్స్ను ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు జెరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసి వేయాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు తాత్కాలికంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. అవతవకలకు పాల్పడిన వారిపై యాక్ట్ 25 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షలకు విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యాశాఖ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
బాల్య వివాహం అడ్డగింత
హనుమంతునిపాడు: మండల పరిధిలోని రెడ్డెవారిపల్లిలో బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. తహసీల్దార్ ఎస్ హరిబాబు, ఎస్సై క్రిష్ణపావని, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం పార్వతి బాలిక ఇంటికి వెళ్లి ఆధార్ కార్డు పరిశీలించారు. 18 ఏళ్ల వయసు లేకపోవడంతో తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై 18 ఏళ్లు నిండకుండా వివాహం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. బాల్య వివాహాల వల్ల ఎదురయ్యే కష్టాలు, ఇబ్బందులను తల్లిదండ్రులకు తెలియజేశారు. బాల్య వివాహాలతో ఎన్నో అనర్థాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం వివాహం చేయకుండా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలతో లిఖితపూర్వకంగా లేఖ తీసుకుని సంతకాలు చేయించుకున్నారు.