Sakshi News home page

ఎన్నికల్లో నోటాను మీటే ఓట్లు ఎన్సో తెలియాలంటే..? వేచుండాల్సిందే!

Published Tue, Nov 7 2023 5:24 AM

- - Sakshi

సాక్షి, మెదక్‌/సంగారెడ్డి: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోయినా గతంలో ఓటర్లు ఎవరికో ఒకరికి ఓటు వేసేవారు. కొంత కాలంగా అభ్యర్థులపై తమ అయిష్టతను తెలియజేసేందుకు ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌లో ‘‘నోటా’’ ఆప్షన్‌ను జత చేసింది. దీంతో ఓటర్లు నోటా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు.

బీఆర్‌ఎస్‌ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి ఉపేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆకుల రాజయ్య, బీఎస్పీ నుంచి దూడ యాదేశ్వర్‌, జనతా పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, ఇతర పార్టీలు, స్వతంత్రులు బరిలో నిలిచారు. వారిలో పద్మాదేవేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఉపేందర్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కాగా బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య డిపాజిట్‌ కోల్పోయారు.

ఇక మిగతా వారి సంగతి అంతంత మాత్రమే. ఈ ఎన్నికల్లో 899 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో కలిపి మొత్తం 1,68,911 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 2263 మంది నోటాకు ఓటేసి అభ్యర్థులపై తమ నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో వివిధ శాఖల ద్వారా అత్యవసర సేవలు అందించే అధికారులకు కేటాయించే 899 పోస్టల్‌ బ్యాలెట్‌లలో 49 ఓట్లు చెల్లకుండా పోగా, 3 ఓట్లు నోటాకు పడడం గమనార్హం.

ఇప్పటికీ ‘‘నోటా’’ అనే మీట ఉందనే విషయం చాలా మంది ఓటర్లకు తెలియదు. అందువల్లే నోటాకు ఓట్లు తక్కువగా పడుతున్నాయని విద్యావంతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటును నోటాకు కాకుండా సరైన నాయకుడికి వేసి అభివృద్ధికి దోహద పడాలని మేధావులు సూచిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో నోటాను మీటే ఓట్లు ఎన్సో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇవి చదవండి: మాటకు మాట! దూషణల పర్వంగా ప్రచారం!!

Advertisement

What’s your opinion

Advertisement