Asia Cup 2022: Virat Kohli Meets Babar Azam Ahead IND Vs PAK Clash, Video Viral - Sakshi
Sakshi News home page

Asia Cup 2022 Ind Vs Pak: బాబర్‌ ఆజంను పలకరించిన కోహ్లి.. వీడియో వైరల్‌! రషీద్‌తోనూ ముచ్చట!

Published Thu, Aug 25 2022 10:37 AM

Asia Cup 2022: Virat Kohli Meets Babar Azam Ahead Ind Vs Pak Clash Video - Sakshi

Virat Kohli- Babar Azam- India Vs Pakistan: ఆసియా కప్‌-2022 టోర్నీ ఆడేందుకు ఇప్పటికే టీమిండియా, పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌ తదితర జట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చేరుకున్నాయి. దుబాయ్‌ వేదికగా ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న మెగా ఈవెంట్‌ కోసం ప్రాక్టీసు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఆయా జట్ల ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. మరోవైపు.. మైదానంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కోచ్‌లు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. టీమిండియా ఆటగాళ్లు దుబాయ్‌ గ్రౌండ్‌లో ఉన్న సమయంలో అఫ్గనిస్తాన్‌, పాకిస్తాన్‌ ఆటగాళ్లు కూడా అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. ఇది గమనించిన భారత ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, యజువేంద్ర చహల్‌.. అఫ్గన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, కెప్టెన్‌ మహ్మద్‌ నబీని ఆప్యాయంగా పలకరించారు.

హైలైట్‌గా విరాట్‌ కోహ్లి.. బాబర్‌ ఆజంను పలకరించి..
ఇక టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సైతం రషీద్‌తో ముచ్చటించాడు. అదే విధంగా పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను ఆత్మీయంగా పలకరించి కరచాలనం చేశాడు. ఇటీవల కాలంలో అతడు సాధిస్తున్న రికార్డులను అభినందిస్తున్నట్లుగా భుజం మీద చేయి వేసి ఆప్యాయత ప్రదర్శించాడు. ఆ తర్వాత కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ జట్టుకు మార్గనిర్దేశనం చేస్తూ కనిపించాడు.

ఈ వీడియో చూసిన కోహ్లి అభిమానులు.. ఎప్పటిలాగే ఈ వీడియోలోనూ తమ ఆరాధ్య క్రికెటర్‌ హైలైట్‌గా నిలిచాడని, పాక్‌ కెప్టెన్‌ పట్ల అతడు వ్యవహరించిన తీరు ఎంతో హుందాగా ఉందంటూ మురిసిపోతున్నారు. దుబాయ్‌లో ఆగష్టు 28న జరుగనున్న భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చి జట్టును గెలిపిస్తాండంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా టీ20 వరల్డ్‌కప్‌-2021 సమయంలోనూ పాక్‌ చేతిలో ఓటమి అనంతరం అప్పటి మెంటార్‌ ఎంఎస్‌ ధోని, నాటి కెప్టెన్‌ కోహ్లి.. పాకిస్తాన్‌ ఆటగాళ్లను అభినందించిన విషయం తెలిసిందే. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి ఆసియా కప్‌ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగనున్న విషయం తెలిసిందే. భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌ సహా క్వాలిఫైయర్స్‌లో విజయం సాధించి టోర్నీకి అర్హత సాధించిన హాంకాంగ్‌ సైతం పాల్గొనబోతోంది.

చదవండి: ASIA CUP 2022: ఆసియా కప్‌కు అర్హత సాధించిన హాంకాంగ్‌.. భారత్‌, పాక్‌తో ఢీ!  
Asia Cup 2022: ఆసియాకప్‌కు ముందు కోహ్లి కీలక నిర్ణయం! ఇకనైనా దశ మారనుందా?

Advertisement
Advertisement