IND vs SL 1st Test: Fans Troll After Rishabh Pant Out 96 Runs His 5th Nervous 90s in Tests - Sakshi
Sakshi News home page

Rishabh Pant: ఏంటి పంత్‌.. దంచికొట్టి ఆఖర్లో ఊసురుమనిపించావు

Published Fri, Mar 4 2022 5:50 PM

Fans Troll After Rishabh Pant Out 96 Runs His 5th Nervous 90s In Tests - Sakshi

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ దూకుడైన ఆటతీరు కనబరిచాడు. క్రీజులో ఉన్నంతసేపు లంక బౌలర్లలను దడదడలాడించిన పంత్‌ వన్డే తరహాలో ఇన్నింగ్స్‌ ఆడాడు. కచ్చితంగా సెంచరీ చేస్తాడనుకుంటున్న తరుణంలో 96 పరుగుల వద్ద ఔట్‌ అయ్యి కేవలం నాలుగు పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. పంత్‌ 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. తొలి హాఫ్‌ సెంచరీకి 75 బంతులు తీసుకున్న పంత్‌.. సెంచరీ చేసే  క్రమంలో 22 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. దీన్నిబట్టే పంత్‌ బ్యాటింగ్‌ ఎంత విధ్వంసరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 

ఇక పంత్‌ సెంచరీ చేసే క్రమంలో తొంబైల్లో ఔటవ్వడం ఇది ఐదోసారి. ఇంతకముందు 2018లో వెస్టిండీస్‌పై(రాజ్‌కోట్‌) 92 పరుగులు, 2018లో వెస్టిండీస్‌పై(హైదరాబాద్‌) 92 పరుగుల వద్ద, 2021లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై 97 పరుగులు, 2021 చెన్నై వేదికగా ఇంగ్లండ్‌పై 91 పరుగుల వద్ద ఔటయ్యాడు. తాజాగా శ్రీలంకపై మొహలీ వేదికగా 96 పరుగులు చేసి ఔట్‌ అయి నెర్వస్‌ నైంటీస్‌ ఫోబియా బారిన పడ్డాడు. ఇక వికెట్‌కీపర్లలో తొంబైల్లో ఎక్కువసార్లు ఔటైన జాబితాలో పంత్‌ రెండో స్థానంలో ఉన్నాడు. పంత్‌ కంటే ముందు ఎంఎస్‌ ధోని 90ల్లో ఎక్కువసార్లు ఔటైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇక టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు నెర్వస్‌ నైంటీస్‌ ఫోబియా ఎక్కువగా ఉండేదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కాగా పంత్‌ ఆటతీరును ఎంజాయ్‌ చేసిన అభిమానులు.. సెంచరీ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సెంచరీ చేస్తావనుకుంటే.. ఏంటి పంత్‌ ఇలా చేశావు... ఆరంభం నుంచి దంచికొట్టి చివర్లో ఊసురుమనిపించావ్‌.. అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక తొలి టెస్టులో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. జడేజా 45, అశ్విన్‌ 10 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

పంత్‌ స్టన్నింగ్స్‌ ఇన్నింగ్స్‌ కోసం క్లిక్‌ చేయండి

Advertisement
Advertisement