Ind vs Afg: కావాలనే అలా చేశాం: రోహిత్‌ శర్మ | Ind vs Afg 1st T20: We Want to Challenge Ourselves Ahead WC, Says Rohit Sharma - Sakshi
Sakshi News home page

Ind vs Afg: అందుకే 19వ ఓవర్లో బంతి అతడి చేతికి: రోహిత్‌ శర్మ

Published Fri, Jan 12 2024 3:00 PM

Ind vs Afg 1st T20 Rohit Sharma: We Want to Challenge Ourselves Ahead WC - Sakshi

India vs Afghanistan, 1st T20I- Rohit Sharma Comments: టీ20 ప్రపంచకప్‌-2024కు సన్నద్ధమయ్యే క్రమంలో టీమిండియా యువ క్రికెటర్లు కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ఇందుకోసం ఉద్దేశపూర్వకంగానే వాళ్లను కొన్నిసార్లు ఒత్తిడిలోకి నెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. మెగా టోర్నీకి సిద్ధమయ్యే క్రమంలో ప్రయోగాలకు వెనుకాడబోవద్దని మేనేజ్‌మెంట్‌ స్పష్టంగా చెప్పినట్లు పేర్కొన్నాడు.

14 నెలల తర్వాత రీఎంట్రీ
కాగా వరల్డ్‌కప్‌నకు ముందు భారత జట్టు అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. సీనియర్‌, స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఈ సిరీస్‌ ద్వారా దాదాపు 14 నెలల విరామం తర్వాత రీఎంట్రీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌తో రోహిత్‌ పునరాగమనం చేయగా.. రెండో టీ20 నుంచి కోహ్లి అందుబాటులోకి రానున్నాడు.

ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో గురువారం మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. రోహిత్‌, అక్షర్‌ పటేల్‌ మినహా మిగతా అంతా కుర్రాళ్లే ఆడిన ఈ టీ20లో తాము అమలు చేసిన ప్రణాళికల గురించి హిట్‌మ్యాన్‌ వివరించాడు. 

మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఆటలో వైవిధ్యం చూపేందుకు ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా మా బౌలర్లను అన్ని రకాల పరిస్థితుల్లో మెరుగ్గా బౌలింగ్‌ చేసేందుకు సంసిద్ధులను చేయాలని భావించాం. 

అందుకే 19వ ఓవర్లో అతడి చేతికి బంతి
అందులో భాగంగానే.. ఈరోజు వాషీ(వాషింగ్టన్‌ సుందర్‌) చేత 19వ ఓవర్‌ వేయించడం మీరంతా చూసే ఉంటారు. ఎక్కడైతే మా యంగ్‌ ప్లేయర్లు కాస్త వెనుకబడి ఉన్నారు?.. ఒత్తిడిలో ఉన్నపుడు నేర్పుతో అధిగమించగలరా లేదా అని పరీక్షించాలనుకున్నాం.

అందుకు అనుగుణంగానే ఈరోజు మా వ్యూహాలు అమలు చేశాం. అయితే, మ్యాచ్‌ను మూల్యంగా చెల్లించే పరిస్థితులు మాత్రం రాకూడదని జాగ్రత్తపడ్డాం. ఏదేమైనా ఈరోజు సానుకూలంగా ముగిసింది’’ అని రోహిత్‌ శర్మ హర్షం వ్యక్తం చేశాడు.

శివాలెత్తిన శివం దూబే
కాగా మొహాలీ మ్యాచ్‌లో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌(2/23).. మరో స్పిన్నర్‌ రవి బిష్ణోయి మూడు ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 35 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక వాషింగ్టన్‌ సుందర్‌ 3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు. అయితే, 19వ ఓవర్లోనే ఏకంగా అతడు 13 పరుగులు సమర్పించుకోవడం విశేషం.

ఇదిలా ఉంటే.. అఫ్గన్‌ విధించిన 159 పరుగుల లక్ష్య ఛేదనలో ఆల్‌రౌండర్‌ శివం దూబే 40 బంతుల్లో 60 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. కాగా అఫ్గనిస్తాన్‌ సిరీస్‌ ముగిసిన తర్వాత ఐపీఎల్‌-2024లో ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఆ తర్వాత జూన్‌ 4 నుంచి టీ20 ప్రపంచప్‌ టోర్నీ ఆరంభం కానుంది.

చదవండి: Rohit Sharma: రీఎంట్రీలో రోహిత్‌ డకౌట్‌.. మరీ ఘోరంగా..! తప్పు ఎవరిది?

Advertisement
Advertisement