Sakshi News home page

ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్‌.. తొలి రోజు టీమిండియా బ్యాటర్ల జోరు

Published Thu, Dec 14 2023 6:15 PM

INDW VS ENGW Only Test: India 410 For 7 Wickets At Day One Stumps - Sakshi

స్వదేశంలో (నవీ ముంబై) ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో జరుగుతున్న ఏ‍కైక టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా మహిళా బ్యాటర్ల హవా కొనసాగింది. తొలి రోజు భారత బ్యాటర్లు ప్రత్యర్ధి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోర్‌ (94 ఓవర్లలో) చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (17), షఫాలీ వర్మ (19) నిరాశపర్చినప్పటికీ ఆ తర్వాత బరిలోకి దిగిన బ్యాట​ర్లందరూ‌ రాణించారు.

శుభ సతీశ్‌ (69), జెమీమా రోడ్రిగెజ్‌ (68), యస్తికా భాటియా (66), దీప్తి శర్మ (60 నాటౌట్‌) అర్ధసెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (49), స్నేహ్‌ రాణా (30) పర్వాలేదనిపించారు. ఆట ముగిసే సమయానికి దీప్తి శర్మకు జతగా పూజా వస్త్రాకర్‌ (4) క్రీజ్‌లో ఉంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో లారెన్‌ బెల్‌ 2 వికెట్లు పడగొట్టగా.. కేట్‌ క్రాస్‌, నాట్‌ సీవర్‌ బ్రంట్‌, చార్లెట్‌ డీన్‌, సోఫీ ఎక్లెస్టోన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌.. భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20లు నెగ్గి ఇంగ్లండ్‌ సిరీస్‌ కైవసం చేసుకుంది. నామమాత్రపు చివరి టీ20లో టీమిండియా గెలిచింది. 

Advertisement

What’s your opinion

Advertisement