టీమిండియా వెటరన్, ముంబై స్టార్ పేసర్ ధవల్ కులకర్ణి తన ఫస్ట్క్లాస్ కెరీర్ను ఘనంగా ముగించాడు. రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా విధర్బతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ఫస్ట్క్లాస్ క్రికెట్ నుంచి కులకర్ణి తప్పుకున్నాడు. ఈ ఫైనల్ పోరులో విధర్బను 164 పరుగుల తేడాతో చిత్తు చేసిన ముంబై.. 42వ సారి రంజీ ట్రోఫీ టైటిల్ను ముద్దాడింది.
తన కెరీర్ చివర మ్యాచ్లో కూడా కులకర్ణి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొత్తంగా రెండు ఇన్నింగ్స్లు కలిపి ధవల్ 4 వికెట్లు పడగొట్టాడు. కాగా సెకెండ్ ఇన్నింగ్స్లో విధర్బ చివరి వికెట్ను కూడా కులకర్ణినే పడగొట్టడం గమనార్హం. ఉమేశ్ యాదవ్ను క్లీన్ బౌల్డ్ చేసి ముంబైని ఛాంపియన్స్గా కులకర్ణి నిలిపాడు.
ముంబై తరపున 96 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన కులకర్ణి.. 281 వికెట్లు పడగొట్టాడు. ఇక 2016లో ధోని సారథ్యంలో టీమిండియా తరపున కులకర్ణి అరంగేట్రం చేశాడు. అతడికి ధోని నుంచి మంచి సపోర్ట్ కూడా ఉండేది. కానీ తర్వాత కులకర్ణి విఫలం అవ్వడంతో జట్టులో చోటు కోల్పోయాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ధవల్ కులకర్ణి మంచి స్నేహితుడు.
ఇద్దరూ కలిసి చాలా కాలం పాటు ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడారు. వీరిద్దరూ మంబైకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తరపున ధవల్ పలు ఐపీఎల్ సీజన్లు ఆడాడు. ఈ క్రమంలో కులకర్ణి రిటైర్మెంట్పై హిట్మ్యాన్ స్పందించాడు. "ది వారియర్ ఆఫ్ ముంబై, వెల్డన్, వాట్ ఏ కెరీర్" అంటూ రోహిత తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.