Sakshi News home page

జట్టు నుంచి తప్పించారు.. అప్పుడు రోహిత్‌, పంత్‌తో మాట్లాడాను! ఇప్పుడిలా!

Published Fri, Jun 24 2022 1:08 PM

Jemimah Rodrigues: Talked To Rohit Sharma Rishabh Pant Help In Comeback - Sakshi

INDW vs SLW 1st T20- Jemimah Rodrigues: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ ఇచ్చిన సలహాలు, సూచనలు తనకెంతగానో ఉపయోగపడ్డాయని భారత మహిళా క్రికెటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ పేర్కొంది. తాను పూర్తిగా నిరాశలో కూరుకుపోయిన సమయంలో వాళ్లిద్దరి మాటలు స్ఫూర్తి నింపాయని ఉద్వేగానికి లోనైంది. రోహిత్‌, పంత్‌ తనలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించారని వారితో మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది.

కాగా 21 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ చివరిసారిగా గతేడాది అక్టోబరులో భారత్‌ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ లీగ్‌ ది హండ్రెడ్‌లో నార్తర్న్‌ సూపర్‌చేంజెర్స్‌కు ప్రాతినిథ్యం వహించి లీగ్‌ టాప్‌ స్కోరర్లలో ఒకరిగా నిలిచింది. అంతేగాక ఆస్ట్రేలియా బిగ్‌ బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ రెనెగ్రేడ్స్‌కు ఆడి సత్తా చాటింది. 

అయితే, అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ ముంబై బ్యాటర్‌కు ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌ భారత జట్టులో చోటు దక్కుతుందని భావించినా నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో ఎట్టకేలకు శ్రీలంకతో టీ20 సిరీస్‌కు జెమీమా ఎంపికైంది. మొదటి మ్యాచ్‌లో తుది జట్టులో స్థానం దక్కించుకున్న ఆమె.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.

డంబుల్లా వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో 36 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ 138 పరుగుల స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో భారత జట్టు ఆతిథ్య శ్రీలంకపై 34 పరుగుల తేడాతో గెలవడంలో కీలకంగా వ్యవహరించిన జెమీమాను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

ఈ నేపథ్యంలో జెమీమా మాట్లాడుతూ.. శ్రీలంకతో సిరీస్‌కు ముందు తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి గుర్తు చేసుకుంది. ‘‘ఇక్కడికి వచ్చే ముందు వరకు నా ప్రయాణం మరీ అంత సాఫీగా ఏమీ సాగలేదు. నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. నిరాశలో ఉన్న సమయంలో రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌తో మాట్లాడాను. 

ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కనంత మాత్రాన ప్రతికూల ఆలోచనలతో మనసు పాడుచేసుకోవద్దని, ఇలాంటి సవాళ్లను దాటుకుని ముందుకు వెళ్లడంలోనే అసలైన మజా ఉంటుందని చెప్పారు. ఇలాంటి వాటిని చాలెంజ్‌గా తీసుకోవాలే తప్ప డీలా పడొద్దని సూచించారు. 

వారితో మాటలు నా ఆలోచనా విధానంపై ప్రభావం చూపాయి. వారిద్దరితో మాట్లాడి మంచి పని చేశాను. ఇప్పుడు నా గేమ్‌ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నాలుగైదు నెలలలుగా నెట్స్‌లో శ్రమించాను. ఎట్టకేలకు జట్టులోకి వచ్చాను’’ అని భావోద్వేగానికి లోనైంది. కాగా జూన్‌ 25న శ్రీలంకతో భారత్‌ తమ రెండో టీ20 మ్యాచ్‌ ఆడనుంది. 

చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్‌ టీ 20 సిరీస్‌.. ఇరు జట్లు, షెడ్యూల్‌.. పూర్తి వివరాలు!
IND vs LEI: రోహిత్‌ శర్మకు ఏమైంది..? అక్కడ కూడా తీరు మారలేదు..!

Advertisement

What’s your opinion

Advertisement