లిమెరిక్ (ఐర్లాండ్): భారత ఆర్చరీ ప్లేయర్ పార్థ్ సాలుంకే ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో పసిడి చరిత్ర లిఖించాడు. ఈ టోర్నమెంట్లో అతను పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో విజేతగా నిలిచాడు. మొత్తంమీద ఈ పోటీల్లో భారత బృందం మునుపెన్నడు లేని విధంగా ఈ టోర్నీలోనే అత్యధికంగా 11 పతకాలు సాధించిన జట్టుగా నిలిచింది.
అండర్ –21 పురుషుల వ్యక్తిగత రికర్వ్ కేటగిరీలో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల సాలుంకే... ఆర్చరీలో ఘనాపాటిలైన కొరియన్ను కంగుతినిపించాడు. ఫైనల్లో పార్థ్ 7–3తో ఏడో సీడ్ సంగ్ ఇంజున్ను ఓడించాడు. ప్రత్యేకించి పురుషుల రికర్వ్లో బంగారు పతకం సాధించిన తొలి ఆర్చర్గా పార్థ్ సాలుంకే ఘనత వహించాడు. మహిళల రికర్వ్లో ఇదివరకే దీపిక కుమారి (2009, 2011), కొమలిక బారి (2019, 2021) బంగారు పతకాలు సాధించారు. మహిళల అండర్–21 వ్యక్తిగత రికర్వ్ కేటగిరీలో భారత్ ఖాతాలో కాంస్యం చేరింది. భజన్ కౌర్ 7–1తో చైనీస్ తైపీకి చెందిన సు సిన్ యూపై నెగ్గింది.