Sakshi News home page

Asia Cup 2023 Hybrid Model: 'పాక్‌కు ఇది అవమానం.. హైబ్రీడ్‌ మోడల్‌ను వ్యతిరేకిస్తున్నా'

Published Thu, Jun 22 2023 10:58 AM

PCB Likely-Chairman Zaka-Ashraf Rejects Hybrid Model-Asia Cup 2023 - Sakshi

''ఆసియా కప్‌ను హైబ్రీడ్‌ మోడ్‌లో నిర్వహించడం ఇష్టం లేదని.. దీనిని వ్యతిరేకిస్తున్నానంటూ''.. పీసీబీకి కాబోయే చైర్మన్‌ జకా అష్రఫ్‌ బాంబు పేల్చాడు. ఇటీవలే పీసీబీ తాత్కాలిక చైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న నజమ్‌ సేథీ ఆసియా కప్‌ను హైబ్రీడ్‌ మోడ్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ)కు ప్రతిపాదన పంపారు. దీనిపై సుధీర్ఘంగా చర్చించిన ఏసీసీ పాక్‌ ప్రతిపాదనను ఒప్పుకొని ఆసియా కప్‌ను హైబ్రీడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది.

దీంతో ఆసియా కప్‌ షెడ్యూల్‌ కూడా విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరగాల్సి ఉంది. దీని ప్రకారం పాకిస్తాన్ లో నాలుగు మ్యాచ్ లు.. శ్రీలంకలో 9 మ్యాచ్ లు ఆడించేందుకు పీసీబీ అంగీకారం తెలిపింది.తాజాగా బుధవారం  పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అష్రఫ్ మాట్లాడుతూ ఆసియా కప్‌ను హైబ్రీడ్‌ మోడ్‌లో నిర్వహించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''నేను ఈ హైబ్రిడ్ మోడల్‌ను గతంలోనే వ్యతిరేకించా. ఇదో అర్థం పర్థం లేని  విధానం. నేను దీనికి అంగీకరించను. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ).. ఈ ఏడాది ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహిస్తానని తెలిపింది. దాని ప్రకారం ఈ టోర్నీ ఇక్కడే జరగాలి.  

ఇక టోర్నీలో ప్రధాన మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్  బయటే జరగనున్నాయి. భూటాన్, నేపాల్ వంటి చిన్న జట్లు మాత్రమే  ఇక్కడికి వస్తున్నాయి.  ఇది పాకిస్తాన్ కు ఒకరకంగా అవమానమే. గతంలో మా బోర్డు ఏం నిర్ణయం తీసుకుందో నాకైతే అవగాహన లేదు. ఆ సమాచారం గురించి నాకు తెలియదు. కానీ క్లారిటీ మాత్రం ఉంది. ఈ తక్కువ వ్యవధిలో ఏం చేయగలనో అది చేస్తా'' అని చెప్పుకొచ్చాడు.

అష్రఫ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ ఏడాది ఆసియా కప్ భవితవ్యం మళ్లీ  ప్రమాదంలో పడ్డట్టే. హైబ్రిడ్ మోడల్ ను తిరస్కరించిన పాకిస్తాన్ ఇప్పుడు ఆడితే పూర్తి మ్యాచ్ లు శ్రీలంకలోనే ఆడాలి లేదంటే  టోర్నీ నుంచి నిష్క్రమించాలి. ఇంతకుమించి  పాక్‌కు మరో ఆప్షన్‌ లేదు. ఎందుకంటే  బీసీసీఐ ఇదివరకే  తాము పాకిస్తాన్ కు వెళ్లేది లేదని  కుండబద్దలు కొట్టింది. ఒకవేళ భారత్ లేకున్నా ఆసియా కప్ నిర్వహించడం  అసాధ్యం. ఇక జకా అష్రఫ్‌ పీసీబీ చైర్మన్‌గా ఉన్న సమయంలో టీమిండియా, పాకిస్తాన్‌లు చివరి'సారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడాయి. 

చదవండి: 'గిల్‌ క్యాచ్‌' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది!

#AsiaCup2023: 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది'

Advertisement

What’s your opinion

Advertisement