ట్రిపుల్‌ సెంచరీతో విరుచుకుపడిన కేకేఆర్‌ ప్లేయర్‌ | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ సెంచరీతో విరుచుకుపడిన కేకేఆర్‌ ప్లేయర్‌

Published Sun, Jan 28 2024 11:08 AM

Ranji Trophy 2024: N Jagadeesan Triple Ton Puts Tamil Nadu On Top - Sakshi

రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో మరో ట్రిపుల్‌ సెంచరీ నమోదైంది. తొలుత అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆటగాడు తన్మయ్‌ అగర్వాల్‌ ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీతో విరుచుకుపడగా.. తాజాగా చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు ఓపెనర్‌, కేకేఆర్‌ ఆటగాడు ఎన్‌ జగదీశన్‌ త్రిశతకంతో (321) కదం తొక్కాడు. జగదీశన్‌కు తోడు ప్రదోశ్‌ పాల్‌ (105), బాబా ఇంద్రజిత్‌ (123) శతకాలతో రాణించడంతో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 610 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అంతకుముందు బౌలింగ్‌లోనూ తమిళనాడు బౌలర్లు రెచ్చిపోయారు.

సాయికిషోర్‌ (3/31), వారియర్‌ (3/28), అజిత్‌ రామ్‌ (2/6), కుల్దీప్‌ సేన్‌ (1/34) ధాటికి చండీఘడ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే కుప్పకూలింది. చండీఘడ్‌ ఇన్నింగ్స్‌లో కునాల్‌ మహాజన్‌ (28) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌ పేలవ ప్రదర్శనతో ఓటమిని ఖరారు చేసుకున్న చండీఘడ్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ చెత్తగా ఆడుతుంది. మూడో రోజు తొలి సెషన్‌ సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.

ఆ జట్టు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 462 పరుగులు వెనుకంజలో ఉంది. సాయికిషోర్‌ (2/15) చండీఘడ్‌ను మరోసారి దెబ్బకొట్టాడు. మయాంక్‌ సిద్దూ  (4), కునాల్‌ మహాజన్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, జగదీశన్‌ ఐపీఎల్‌లో గత సీజన్‌ వరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడాడు. 2024 సీజన్‌ వేలంలో జగదీశన్‌ను కేకేఆర్‌ సొంతం చేసుకుంది.

Advertisement
Advertisement