● రోకలి బండతో కొట్టి హత్య
పొదలకూరు: రోకలి బండతో కొట్టి తల్లిని తనయుడు కడతేర్చిన ఘటన అంకుపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మాముడూరు అంకమ్మ (75)కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఈమె చిన్న కుమారుడు ప్రసాద్ మద్యానికి బానిసవ్వడంతో భార్య, ఇద్దరు పిల్లలు అతడికి దూరంగా నెల్లూరులో జీవిస్తున్నారు. ప్రస్తుతం ప్రసాద్తో తల్లి ఉంటున్నారు. కొంతకాలంగా వయస్సు కారణంగా అనారోగ్యంతో ఆమె మంచం పట్టారు. ఈ క్రమంలో ఆమెకు సేవలు చేయలేక.. మద్యం మత్తులో ఉన్న ప్రసాద్ ఇంట్లో ఉన్న రోకలిబండతో తలపై కొట్టి హత్య చేశారు. అనంతరం మరోసారి మద్యం తాగి బంధువుల ఇంటికెళ్లి తన తల్లిని రోకలిబండతో కొట్టానని చెప్పారు. దీంతో గ్రామానికి చెందిన వారు డయల్ 100కు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి పోలీసులు వెళ్లగా, మద్యం మత్తులో నిందితుడు నిద్రిస్తూ కనిపించారు. దీంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కావలిలో ఉన్న పెద్ద కుమారుడు గ్రామానికి చేరుకున్నారు. ఘటన జరిగిన గ్రామం కండలేరు పోలీస్స్టేషన్ పరిధిలో ఉండటంతో రాపూరు సీఐ సుబ్రహ్మణ్యం కేసు దర్యాప్తు చేస్తున్నారు.