కొరుక్కుపేట: తమిళ జాలర్లపై మరోసారి శ్రీలంకా సేనలు విరుచుకు పడ్డాయి. వివరాలు.. కారైకల్ జిల్లా క్లించల్మేడు మత్స్యకార గ్రామానికి చెందిన చెల్లదురైతోపాటు, 12 మంది మత్స్యకారులు తన సొంత పడవలో చేపల వేటకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి కొడియకరైకు ఆగ్నేయంగా హిందూ మహాసుముద్రంలో చేపలు పట్టారు. అక్కడికి వచ్చిన శ్రీలంక సేనలు కారైకల్ మత్స్యకారులపై కాల్పులకు పాల్పడ్డారు. ఆ తర్వాత రూ. 5లక్షలు విలువైన వల వేసిన వస్తువులను ఎత్తుకెళ్లారు. శ్రీలంక నేవీ సిబ్బంది దాడిలో నివాష్, కార్తీక్, మెదిత్ , శివగురు, అజిత్ అనే ఐదుగురు మత్స్యకారులు గాయపడ్డారు. దీంతో మత్స్యకారులు ఇండియన్ కోస్ట్ గార్డుకు సమాచారం అందించారు.అక్కడికి చేరుకున్న భారత తీర రక్షణదళం మత్స్యకారులకు ప్రథమ చికిత్స అందించి కారైకల్ పోర్టుకు తీసుకుని వచ్చారు. బాధిత మత్స్యకారులు మాట్లాడుతూ చేపల వేట సమయంలో శ్రీలంక నావికాదళం కాల్పులు జరపడంతో బోటును ఆపివేశామని, అయితే శ్రీలంక నేవి సిబ్బంది కాల్పులు జరపడమే కాకుండా ఇనుపరాడ్లతో దాడి చేసి వల, ఇతర వస్తువులు పట్టుకెళ్లిపోయారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి కోరారు.
తమిళ మత్స్యకారులపై శ్రీలంక బలగాల కాల్పులు
ఆరుగురికి గాయాలు