● ఇక నైనా తీరు మార్చుకోవాలన్న మంత్రులు
సాక్షి, చైన్నె: రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి శనివారం మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఈనేపథ్యంలో సుప్రీంకోర్టు అక్షింతల నేపథ్యంలో ఇకనైనా రాష్ట్రాల గవర్నర్లలో మార్పులు రావాలని మంత్రులు దురై మురుగన్, రఘుపతి వ్యాఖ్యానించారు. వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య జరుగుతున్న వివాదం సుప్రీం కోర్టుకు చేరిన విషయం తెలిసిందే. రాష్ట్రాల గవర్నర్ల తీరుపై శుక్రవారం ఓ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ రవి ఢిల్లీ వెళ్లడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 10 ముసాయిదాలను మళ్లీ అసెంబ్లీ ఆమోదించి తనకు పంపించిన దృష్ట్యా, వాటిపై ఇప్పటికే గవర్నర్ చట్ట నిపుణులతో చర్చించినట్టు సమాచారం. తాజాగా ఈవ్యవహారంపై ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు అధికారులు, చట్ట నిపుణులతో గవర్నర్ చర్చించే అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో గవర్నర్లు ఇకనైనా మారాలని రాష్టమంత్రి దురై మురుగన్ హితవు పలికారు. న్యాయ మంత్రి రఘుపతి పేర్కొంటూ, ముసాయిదాలపై గవర్నర్ మంచి నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తున్నామన్నారు. ఒక వేళ ఆయన వెనక్కి పంపిస్తే మళ్లీ ఆమోందిచి రాజ్ భవన్కు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.