Sabita Indra Reddy Travels In RTC Bus Prashanth Reddy Celebrates Bday For Tree - Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సెక్కిన మంత్రి.. సీఎం నాటిన మొక్కకు హ్యాపీ బర్త్‌డే

Published Fri, Jul 7 2023 8:09 AM

Sabita Travels In RTC Bus Prashanth Reddy Celebrats Bday For Tree - Sakshi

సాక్షి, మహేశ్వరం: విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరుగు పయనంలో మన్సాన్‌పల్లి చౌరస్తా వద్ద తన కాన్వా య్‌ను ఆపారు. నాగారం వైపు వెళ్తున్న బస్సు ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులతో ముచ్చటించారు.

ఏ పాఠశాలలో చదు తున్నారు? బస్సులు సమయానికి వస్తున్నాయా? ప్రభుత్వ పాఠశాలలో బోధన, వసతులు బాగున్నాయా?.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో ఆమె ఫొటోలు దిగారు. కాసేపు బస్సులో ప్రయాణించిన తర్వాత మంత్రి .. తిరిగి తన కారులో హైదరాబాద్‌ బయలుదేరారు. 

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి...తన ఇంటి వద్ద ఎనిమిదేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ మొదటి విడత హరితహారంలో నాటిన మొక్కకు గురువారం పుట్టినరోజు వేడుక నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం అడవుల శాతం తగ్గిపోతుంటే, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్‌ చొరవ వల్ల 7.7 శాతం అడవులు పెరిగాయన్నారు.
-వేల్పూర్‌ 

అరక పట్టిన అమాత్యుడు
నిర్మల్‌ జిల్లాలో గిరిజనులకు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సారంగాపూర్‌ మండలం రవీంద్రనగర్‌ తండాకు వెళ్లి పోడు భూమిలో ఇలా అరక పట్టి దుక్కి దున్నారు. పోడు భూముల్లో రతనాలు పండించి ఆదర్శంగా నిలవాలని ఆదివాసీ రైతులకు సూచించారు. 
– సాక్షి ఫొటోగ్రాఫర్‌ నిర్మల్‌

అల‘గెల’గా
సాధారణంగా ఒక అరటి చెట్టుకు ఒక గెల మాత్రమే కాస్తుంది. ఇందుకు భిన్నంగా ఒకే చెట్టుకు రెండు అరటి గెలలు కాశాయి. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ మద్దిపుట్టులో ఓ గిరిజనుడి ఇంటి వద్ద ఈ అద్భుతాన్ని పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు.  
– హుకుంపేట

Advertisement
Advertisement