ఏ పంట వేస్తే ఎంత లాభం? | Sakshi
Sakshi News home page

ఏ పంట వేస్తే ఎంత లాభం?

Published Tue, Nov 9 2021 4:22 AM

Department Of Agriculture Special Drive On Alternative Crops In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వరి సాగును తగ్గించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రైతులను సన్నద్ధం చేసేలా.. వారిని ప్రత్యా మ్నాయ పంటలవైపు మళ్లించేలా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో వరి కోత లన్నీ పూర్తవుతాయని, యాసంగికి ఏర్పాట్లు జరుగుతుండ గానే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి వరికి బదులు ఇతర పంటలు వేయాల్సిన ప్రాధాన్యం గురించి చెప్పాలని నిర్ణయిం చింది. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి నిర్వహించాలో ఇంకా ఖరారు కాలేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు
స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా నిర్వహించే సద స్సుల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవ డం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరి స్తారు. మద్దతు ధర, మార్కెట్లో డిమాండ్‌ వంటి అంశాలను తెలియజెప్పి రైతులకు భరోసా కల్పించాలని నిర్ణయించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశంలో మినుములకు బాగా డిమాండ్‌ ఉంది. దేశంలో ఆహార భద్రతను అంచనా వేసే సెంట్రల్‌ పూల్‌ వ్యవస్థ ఉంది. దాని ప్రకారం అవసరమైనన్ని మినుములు సెంట్రల్‌ పూల్‌లో లేవు. కాబట్టి మినుములను కొనుగోలు చేయాలని కేంద్రం రాష్ట్రానికి సూచించింది. మద్దతు ధరకే కాకుండా, అవసరమైతే మార్కెట్లో ఎంత ధర ఉంటే అంత ధరకు మినుములు కొనుగోలు చేయాలని ఆదేశించింది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,300 కాగా, ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు రూ.7 వేల వరకు కొంటున్నారు.

ఈ నేపథ్యంలో రూ.7 వేలైనా సరే కొనాలని కేంద్రం ఆదేశించింది. అంటే ఇక నుంచి మార్క్‌ఫెడ్‌ కూడా రూ.7 వేలు లేదా మార్కెట్లో అప్పుడున్న ధరలను బట్టి మినుములు కొనుగోలు చేస్తుంది. ఒకవేళ మద్దతు ధర కంటే మార్కెట్లో ధర తక్కువుంటే, మద్దతు ధరకు కొనుగోలు చేస్తారు. కాగా, ప్రత్యామ్నాయ పంటల సాగుకు అయ్యే ఖర్చు, రాబడిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదిక తయారు చేసింది. వరి బదులు ఏయే పంటలు సాగు చేస్తే ఎంత లాభం వస్తుందనే దానిపై ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ విశ్వవిద్యాలయం సహకారంతో పంటల వారీగా పెట్టుబడి, లాభాల తీరును నివేదికలో పొందుపర్చింది. ప్రత్యామ్నాయ పంటల్లో ఆవాలకు ఎక్కువ లాభాలు వస్తున్నట్లు నివేదిక చెబుతోంది. ఆ తర్వాత అధిక లాభాలు వచ్చే వరుసలో మినుములు, శనగ, నువ్వుల పంటలున్నాయి. అతి తక్కువ లాభం వచ్చే కేటగిరీలో కుసుమ పంట ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 

జోన్లవారీగా పంటలు...
జోన్ల వారీగా ఏ పంటలను సాగు చేయాలనే దానిపై వ్యవసాయశాఖ గతంలోనే అంచనాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం ఆయా జోన్లలోని రైతులను స్పెషల్‌ డ్రైవ్‌లో సన్నద్ధం చేస్తారు. ఉత్తర తెలంగాణ జోన్‌ కింద ఉన్న ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో వరికి బదులు వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ సాగు చేయించాలని నిర్ణయించారు.

సెంట్రల్‌ తెలంగాణ జోన్‌ కింద సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో వరి స్థానంలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ సాగు చేయిస్తారు. దక్షిణ తెలంగాణ జోన్‌లో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌ కర్నూల్, జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నారాయణపేట జిల్లాలను చేర్చారు. ఈ జిల్లాల్లో వరికి బదులుగా వేరుశనగ, పొద్దు తిరుగుడు, శనగ, పెసర పంటలు వేసేలా రైతులను సన్నద్ధం చేస్తామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆయా జిల్లాల్లో మిగిలిన ప్రత్యామ్నాయ పంటలను కూడా రైతులకు సూచిస్తారు. 
 

Advertisement
Advertisement